వరల్డ్ కప్ మధ్యలో జట్టును వీడి ఇంటికి వెళ్లిపోయిన రింకూ సింగ్... కారణం ఇదే!

  • కుటుంబంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితితో జట్టును వీడిన రింకూ సింగ్
  • తండ్రికి కేన్సర్.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని సమాచారం
  • జింబాబ్వేతో జరగనున్న కీలక మ్యాచ్‌కు రింకూ దూరం
  • రింకూ స్థానంలో తుది జట్టులోకి సంజూ శాంసన్‌కు అవకాశం
  • దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు దూరమైన అక్షర్ పటేల్ మళ్లీ జట్టులోకి వచ్చే ఛాన్స్
టీ20 ప్రపంచకప్‌లో కీలకమైన సూపర్‌ 8 దశలో ఉన్న టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. భారత జట్టు స్టార్ ఫినిషర్, ఆల్‌రౌండర్ రింకూ సింగ్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య అత్యవసర పరిస్థితి కారణంగా జట్టును వీడాడు. జింబాబ్వేతో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌కు ముందు రింకూ హుటాహుటిన ఉత్తరప్రదేశ్‌లోని తన స్వస్థలానికి పయనమయ్యాడు.

కొంతకాలంగా లివర్ కేన్సర్‌తో బాధపడుతున్న రింకూ సింగ్ తండ్రి ఆరోగ్యం విషమించడంతో ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించారు. లివర్ కేన్సర్ 4వ దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే మంగళవారం చెన్నైలో జరిగిన జట్టు ప్రాక్టీస్ సెషన్‌కు రింకూ హాజరుకాలేదు. జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్‌లో అతడు ఆడే అవకాశాలు దాదాపుగా లేనట్లేనని తెలుస్తోంది.

సూపర్ 8 తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 76 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లలో తప్పక గెలవాల్సిన ఒత్తిడిలో ఉంది. ఇలాంటి కీలక సమయంలో డెత్ ఓవర్లలో బ్యాటింగ్‌కు దిగి జట్టుకు అండగా నిలిచే ఫినిషర్ రింకూ దూరం కావడం జట్టు సమతుల్యతపై ప్రభావం చూపనుంది. రింకూ మంచి ఫీల్డర్ కూడా కావడంతో జట్టుకు ఇది పెద్ద లోటుగా మారింది.

రింకూ సింగ్ స్థానంలో తుది జట్టులోకి వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను తీసుకునే అవకాశాలున్నాయి. దీంతో పాటు, దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో అనూహ్యంగా పక్కనపెట్టిన స్పిన్నర్ అక్షర్ పటేల్‌ను జింబాబ్వేతో పోరు కోసం మళ్లీ జట్టులోకి తీసుకురావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


More Telugu News