టీ0 వరల్డ్ కప్ సెమీస్, ఫైనల్ వేదికలపై సస్పెన్స్... టికెట్లు మాత్రం అమ్ముతున్నారు!

టీ20 ప్రపంచకప్ 2026 తుది అంకానికి చేరుకుంటున్న వేళ, క్రికెట్ అభిమానులకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక అప్‌డేట్ ఇచ్చింది. టోర్నీ సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌ల టికెట్ల అమ్మకాలు మంగళవారం (ఈరోజు) సాయంత్రం 7 గంటల నుంచి అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. అభిమానులు ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

షెడ్యూల్ ప్రకారం మార్చి 4న తొలి సెమీఫైనల్, మార్చి 5న రెండో సెమీఫైనల్, మార్చి 8న ఫైనల్ జరగనున్నాయి. రెండో సెమీఫైనల్‌కు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఖరారు కాగా, తొలి సెమీఫైనల్, ఫైనల్ వేదికలపై మాత్రం పాకిస్థాన్ ప్రదర్శన ఆధారంగా కొన్ని నిబంధనలు విధించారు.

ఐసీసీ నిబంధనల ప్రకారం.. పాకిస్థాన్ జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తే, ఆ జట్టు తమ మ్యాచ్‌ను మార్చి 4న కొలంబోలో ఆడుతుంది. ఒకవేళ పాక్ అర్హత సాధించని పక్షంలో, శ్రీలంక జట్టు సెమీస్‌కు చేరితే (ప్రత్యర్థి భారత్‌ కాకుంటే) ఆ మ్యాచ్ కూడా కొలంబోలోనే జరుగుతుంది. ఈ రెండు పరిస్థితులు లేకపోతే తొలి సెమీఫైనల్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇస్తుంది.

ఫైనల్ వేదిక కూడా పాకిస్థాన్ ప్రదర్శనపైనే ఆధారపడి ఉంది. పాక్ ఫైనల్‌కు చేరితే, టైటిల్ పోరు కొలంబోలో జరుగుతుంది. లేదంటే, ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇస్తుంది. టికెట్లు కొనుగోలు చేశాక వేదిక మారితే, డబ్బులను పూర్తిగా వాపస్ చేస్తామని ఐసీసీ స్పష్టం చేసింది. ప్రస్తుతం సూపర్-8 రౌండ్‌లో భారత్ గ్రూప్-ఏలో, పాకిస్థాన్ గ్రూప్-బీలో ఉన్నాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్-2 జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

ICC T20 World Cup 2026
T20 World Cup
ICC
Pakistan Cricket
India Cricket
Semi Finals
Finals
Colombo
Ahmedabad
Wankhede Stadium

More Telugu News