అమెరికా అతిపెద్ద యుద్ధనౌకలో వింత కష్టాలు... ఇరాన్‌తో ఉద్రిక్తతల నడుమ టాయిలెట్లతో తిప్పలు!

  • అమెరికా యుద్ధనౌక జెరాల్డ్ ఫోర్డ్‌లో సమస్యలు
  • నౌకలోని టాయిలెట్లు, మురుగునీటి వ్యవస్థ తరచూ విఫలం
  • గడువుకు మించి సముద్రంలోనే ఉండటంతో సిబ్బంది మానసిక ఒత్తిడి
  • కొందరు నావికులు నేవీని విడిచిపెట్టే ఆలోచనలో ఉన్నట్లు కథనం
  • ప్లంబింగ్ సమస్యలతో సిబ్బంది రోజుకు 19 గంటల వరకు పని
మధ్యప్రాచ్యంలో ఇరాన్‌తో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ, అమెరికా తన సైనిక శక్తిని పెద్ద ఎత్తున మోహరిస్తోంది. అయితే, ఈ కీలక సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఖరీదైన విమాన వాహక నౌక యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఊహించని సమస్యలతో సతమతమవుతోంది. యుద్ధ సన్నాహాల కంటే ఎక్కువగా.. నౌకలోని మరుగుదొడ్ల వ్యవస్థ విఫలమవడం సుమారు 5,000 మంది సిబ్బందికి నరకం చూపిస్తోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో, మధ్యప్రాచ్యంలో సైనిక శక్తిని ప్రదర్శించేందుకు ఈ నౌకను రంగంలోకి దించారు. గత ఏడాది జూన్‌లో సముద్రంలోకి వచ్చిన ఈ నౌక మోహరింపును ఇప్పటికే రెండుసార్లు పొడిగించారు. దీంతో సిబ్బంది దాదాపు 8 నెలలుగా సముద్రంలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. సాధారణంగా శాంతికాలంలో ఆరు నెలలకు మించి డెప్లాయ్‌మెంట్ (మోహరింపు) ఉండదు. ఇది మరో 11 నెలల వరకు కొనసాగితే, అమెరికా నేవీ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన నిరంతర డెప్లాయ్‌మెంట్‌గా రికార్డు సృష్టిస్తుందని రిటైర్డ్ రియర్ అడ్మిరల్ మార్క్ మాంట్‌గోమరీ వాల్ స్ట్రీట్ జర్నల్‌కు తెలిపారు.

సుమారు 13 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.1 లక్షల కోట్లు) భారీ వ్యయంతో నిర్మించిన ఈ నౌకలో ఏర్పాటు చేసిన వాక్యూమ్ ఆధారిత ప్లంబింగ్ వ్యవస్థే ప్రధాన సమస్యగా మారింది. ఇందులో దాదాపు 650 టాయిలెట్లు ఉన్నాయి. ఏదైనా ఒక టాయిలెట్‌లో సమస్య వస్తే, ఆ సెక్షన్‌లోని అన్ని టాయిలెట్లు పనిచేయకుండా పోతున్నాయి. టీ-షర్టులు, తాళ్లు వంటి వస్తువులు పైపుల్లో ఇరుక్కుపోవడం, కొన్నిసార్లు టాయిలెట్ విడిభాగాలు ఊడిపోవడం వంటి కారణాలతో ఈ వ్యవస్థ తరచూ మొరాయిస్తోంది. జనవరిలో ఎన్‌పీఆర్ రిపోర్ట్ ప్రకారం, ఈ సమస్యలు మరింత తీవ్రమయ్యాయని తెలుస్తోంది.

ఈ సాంకేతిక సమస్యల పరిష్కారానికి నావికా సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. లీక్‌లను అరికట్టేందుకు కొందరు సిబ్బంది రోజుకు 19 గంటల వరకు పనిచేస్తున్నట్లు సమాచారం. డెప్లాయ్‌మెంట్ గడువును పదేపదే పొడిగించడంతో సిబ్బంది శారీరకంగా, మానసికంగా తీవ్ర అలసటకు గురవుతున్నారు. నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉండటం వారిని మరింత కుంగదీస్తోంది. 

నౌక కదలికలను రహస్యంగా ఉంచే 'ఘోస్ట్ మోడ్' కారణంగా బయటి ప్రపంచంతో సంప్రదింపులు కూడా పరిమితమయ్యాయి. ఈ ఒత్తిడితో విసిగిపోయిన కొందరు నావికులు, ఈ డ్యూటీ ముగిసిన వెంటనే నేవీని విడిచిపెట్టాలని భావిస్తున్నట్లు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌తో పాటు జెరాల్డ్ ఫోర్డ్ కూడా చేరడంతో రెండు విమాన వాహక నౌకలు మోహరించినట్లు అయింది. ఈ అంతర్గత సమస్యలు సిబ్బంది నైతిక స్థైర్యంపై ప్రభావం చూపుతున్నప్పటికీ, నౌక యుద్ధ సామర్థ్యంపై ఎలాంటి ప్రభావం లేదని అధికారులు చెబుతున్నారు.


More Telugu News