షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఘటన.. అనుపమ జీవితాన్ని మార్చేసింది!
- 'కార్తికేయ-2' సినిమా షూటింగ్ సమయంలో ఘటన
- షూటింగ్ స్పాట్లో తిరుగుతున్న మేకపిల్లతో ఆనందంగా గడిపిన అనుపమ
- ఆ మేకపిల్లతో మధ్యాహ్నం మటన్ బిర్యానీ చేసిన వైనం
- విషయం తెలిసి వాంతులు చేసుకున్న అనుపమ
- అప్పటి నుంచి శాకాహారిగా మారిన వైనం
గ్లామరస్ హీరోయిన్గా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతో మెప్పించే అనుపమ పరమేశ్వరన్ అంటే అందరికీ అభిమానమే. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వరుస చిత్రాలు చేస్తూ ఆమె ఫుల్ బిజీగా ఉన్నారు. మరోవైపు, షూటింగ్ సమయంలో ఆమె జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆమెను పూర్తిగా మార్చేసింది. ముఖ్యంగా ఆమె ఆహారపు అలవాట్లను మార్చుకోవడానికి కారణమైన "మటన్ బిర్యానీ" ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అసలేం జరిగింది?
'కార్తికేయ-2' సినిమా షూటింగ్ గుజరాత్లో జరుగుతున్న సమయం అది. షూటింగ్ స్పాట్లో ఒక చిన్న మేకపిల్ల తిరుగుతుండేది. జంతువులంటే ఎంతో ప్రేమ ఉన్న అనుపమ, ఆ మేకపిల్లతో షూటింగ్ విరామంలో ఆడుకునేవారు. దానికి ఆహారం పెడుతూ, దానితో గడుపుతూ షూటింగ్ విరామ సమయాలను గడిపేవారు.
ఓ రోజు మధ్యాహ్నం భోజన సమయంలో చిత్ర యూనిట్ అందరికీ మటన్ బిర్యానీ వడ్డించారు. అనుపమ కూడా ఎంతో ఇష్టంగా ఆ బిర్యానీ తింటున్నారు. అదే సమయంలో ఆమె దగ్గరికి వచ్చిన అసిస్టెంట్.. నవ్వుతూ ఒక మాట చెప్పాడు. "మేడం.. మీరు తింటున్నది మీరు పొద్దున ఆడుకున్న ఆ మేకపిల్లనే" అని అన్నాడు. ఆ మాట వినగానే అనుపమ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తింటున్న ముద్ద కూడా గొంతు దిగలేదు. ఆ విషయాన్ని తట్టుకోలేక ఆమెకు వెంటనే వాంతులు అయ్యాయి. తాను ఎంతో ప్రేమగా ఆడుకున్న మూగజీవాన్ని తన కళ్లముందే చంపి, ఆహారంగా పెట్టారనే విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారు.
ఈ సంఘటన అనుపమ మనసుపై ఎంతటి ప్రభావం చూపిందంటే... అప్పటి నుండి ఆమె నాన్-వెజ్ ముట్టడమే మానేశారు. మాంసాహారానికి దూరంగా వుంటున్నారు.