ప్రమాదానికి ముందు రూట్ మార్చాలని కోరిన ఎయిర్ అంబులెన్స్ పైలట్

  • ఝార్ఖండ్‌లో కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్
  • ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి
  • వాతావరణం బాగోలేదని రూట్ మార్చాలని కోరిన పైలట్
  • కొద్దిసేపటికే ఏటీసీతో తెగిపోయిన సంబంధాలు
  • రాంచీ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఘోర ప్రమాదం
ఝార్ఖండ్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఒక ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలిన ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే చత్రా జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదానికి ముందు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గం కోసం పైలట్ అనుమతి కోరినట్టు అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వివరాలు వెల్లడించింది. సోమవారం రాత్రి 7:34 గంటల సమయంలో ఎయిర్ అంబులెన్స్ కోల్‌కతాలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)ని సంప్రదించిందని పేర్కొంది. వాతావరణం సరిగ్గా లేనందున విమానం వెళ్లే మార్గాన్ని మార్చాలని పైలట్ కోరినట్టు తెలిపింది.

అయితే, ఈ సంభాషణ జరిగిన కొద్దిసేపటికే విమానంతో కమ్యూనికేషన్, రాడార్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని డీజీసీఏ వివరించింది. అనంతరం విమానం కూలిపోయినట్టు గుర్తించారు. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మరణించినట్టు అధికారులు ధ్రువీకరించారు.  


More Telugu News