తిరుమలలో భక్తురాలికి పాముకాటు అంటూ ప్రచారం.. అసలు విషయం చెప్పిన టీటీడీ

తిరుమల దర్శన క్యూలైన్‌లో ఓ మహిళా భక్తురాలిని పాము కాటు వేసిందంటూ మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఖండించింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, భక్తులు ఆందోళన చెందవద్దని స్పష్టం చేసింది. అసలు ఘటనపై టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి పూర్తి వివరాలు వెల్లడించారు.

టీటీడీ కథనం ప్రకారం, తెలంగాణలోని వరంగల్‌కు చెందిన శరత్ బాబు, మౌనిక దంపతులు ఆదివారం రాత్రి శ్రీవారి దర్శనానికి తిరుమల వచ్చారు. మ్యూజియం సమీపంలోని ఆర్.బి. సెంటర్ పార్కింగ్ ఏరియాలో కారు దిగిన తర్వాత, మౌనిక పసుపు రాసుకునేందుకు పక్కనే ఉన్న చీకటి ప్రదేశంలోకి వెళ్లారు. ఆ సమయంలో కాలికి ఏదో తగలడంతో పాము అని భయపడ్డారు. ఆమె భర్త పరిశీలించగా అక్కడో చిన్న పాము కనిపించింది.

వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెను తిరుమలలోని అశ్వినీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి ఎలాంటి పాముకాటు జరగలేదని నిర్ధారించారు. అయినప్పటికీ, మరింత భరోసా కోసం ఆమెను తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి పంపించారు. అక్కడి వైద్యులు కూడా ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని స్పష్టం చేశారు. ఆ పాము కూడా విషపూరితం కాదని విచారణలో తెలిసింది.

ఈ ఘటన తర్వాత సోమవారం ఉదయం ఆ దంపతులు క్షేమంగా శ్రీవారిని దర్శించుకున్నారు. తమకు వెంటనే సహాయం అందించిన టీటీడీ సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు తమ భద్రత దృష్ట్యా నిర్దేశించిన క్యూలైన్లు, మార్గాల్లోనే ప్రయాణించాలని, అటవీ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

TTD
Tirumala
TTD news
Snake bite
Tirumala news
Devotee
Mounika
Warangal
AP news
Andhra Pradesh

More Telugu News