యాడ్‌లో ఎగతాళి.. మ్యాచ్‌లో ఓటమి... స్టార్ స్పోర్ట్స్ యాడ్‌పై దుమారం

  • దక్షిణాఫ్రికాను కించపరుస్తూ స్టార్ స్పోర్ట్స్ రూపొందించిన యాడ్
  • విమర్శలు వెల్లువెత్తడంతో ప్రకటనను తొలగించిన బ్రాడ్‌కాస్టర్
  • కప్‌కేక్‌తోనే భారత్‌కు కౌంటర్ ఇచ్చిన దక్షిణాఫ్రికా నటి
  • సూపర్ 8 మ్యాచ్‌లో సఫారీల చేతిలో భారత్ ఓటమి
టీ20 ప్రపంచకప్ 2026 అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన ఓ ప్రకటన తీవ్ర వివాదాస్పదంగా మారింది. భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు ముందు ఇరుజట్ల మధ్య వైరాన్ని హైలైట్ చేసే ఉద్దేశంతో ఈ యాడ్‌ను రూపొందించారు. అయితే, ఇందులో దక్షిణాఫ్రికాను కించపరిచేలా దృశ్యాలు ఉండటంతో క్రీడాభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో స్టార్ స్పోర్ట్స్ ఆ ప్రకటనను తన సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించింది.

వివరాల్లోకి వెళితే... ఈ యాడ్‌లో ఒక కేఫ్‌లో ఉన్న భారత అభిమాని, దక్షిణాఫ్రికా మద్దతుదారుడిని ఒక కప్‌కేక్‌తో ఎగతాళి చేస్తూ 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఓటమిని గుర్తుచేస్తాడు. ఈ వీడియో క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, ప్రత్యర్థి జట్టును అగౌరవపరిచేలా ఉందని నెటిజన్లు విమర్శించారు. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ తన అధికారిక 'ఎక్స్‌' ఖాతా నుంచి ఈ యాడ్‌ను తొలగించింది. అయితే, మ్యాచ్‌కు ముందా? లేక తర్వాతా? అనేది స్పష్టత లేదు. 

ఈ వివాదం మరో మలుపు తీసుకుంది. దక్షిణాఫ్రికా నటి, ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన తంజా వుర్, స్టార్ స్పోర్ట్స్ 'కప్‌కేక్' థీమ్‌పై సెటైరికల్ వీడియోతో స్పందించారు. భారత్ ఓటమి స్కోర్‌కార్డును చూపిస్తూ, కప్‌కేక్ తింటూ 'సో స్వీట్' అని క్యాప్షన్ పెట్టారు. 

2023 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత 18 ఐసీసీ మ్యాచ్‌లలో టీమిండియాకు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. ఈ ఓటమితో భారత్ నెట్ రన్‌రేట్ (-3.800) దారుణంగా పడిపోయింది. సెమీస్‌కు చేరాలంటే జింబాబ్వే (ఫిబ్రవరి 26), వెస్టిండీస్‌తో (మార్చి 1) జరిగే మ్యాచ్‌లలో తప్పక గెలవాల్సి ఉంది.


More Telugu News