Udayanidhi Stalin: కాంగ్రెస్ కు క్యారెక్టర్ లేదు.. డీఎంకేకు బుద్ధిలేదు: బీజేపీ
- కోయంబత్తూరు సభలో ప్రధానిపై డీఎంకే నేత ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు
- మోదీకి భయపడం.. మోదీ తండ్రి వచ్చినా భయపడబోమన్న ఉదయనిధి
- డీఎంకేకు "నీతి, నియమం, బుద్ధి" లేవన్న బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా
- తమిళనాడు ఎన్నికల వేళ పార్టీల 'వ్యక్తిగత' మాటల యుద్ధం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార డీఎంకే, బీజేపీ కూటమి మధ్య మాటల యుద్ధం ముదిరింది. కోయంబత్తూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. ‘‘మాకు నరేంద్ర మోదీ అంటే భయం లేదు. మోదీ తండ్రి వచ్చినా సరే మేము భయపడబోము" అని వ్యాఖ్యానించారు. టీవీలో మోదీ కనిపిస్తే ప్రజలు భయపడుతున్నారని, అదే సీఎం స్టాలిన్ కనిపిస్తే కొత్త పథకాలు వస్తాయని సంతోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికలు 'తమిళనాడు వర్సెస్ ఢిల్లీ' మధ్య జరుగుతున్న పోరాటమని ఉదయనిధి అభివర్ణించారు.
బీజేపీ రిటార్ట్..
ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా తీవ్రంగా స్పందించారు. డీఎంకే పార్టీకి ‘‘నీతి, నియమం, బుద్ధి’’ లేవని మండిపడ్డారు. గత వారం ‘ఏఐ సమ్మిట్’లో కాంగ్రెస్ చేసిన అర్థనగ్న నిరసనలను ప్రస్తావిస్తూ.. ‘‘కాంగ్రెస్ వారు షర్టులు విప్పితే, వారి మిత్రపక్షమైన డీఎంకే బుద్ధిని విడిచిపెట్టింది’’ అని విమర్శించారు. ప్రధాని తల్లిదండ్రులను లక్ష్యం చేసుకోవడం డీఎంకే ఓటమికి సంకేతమని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. డీఎంకే నేతలు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని, అందుకే ప్రధానిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. తమిళనాడులో ఈసారి బీజేపీ-అన్నాడీఎంకే కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.