వైసీపీలో చేరికపై వంగవీటి ఆశాలత క్లారిటీ

  • వైసీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించిన వంగవీటి ఆశాలత
  • సోషల్ మీడియాలో జరుగుతున్నది దుష్ప్రచారమేనని వెల్లడి
  • రాధా-రంగా మిత్రమండలిని బలోపేతం చేయడమే తన లక్ష్యమని స్పష్టీకరణ
  • అభిమానులతో చర్చించాకే రాజకీయాలపై తుది నిర్ణయం తీసుకుంటానని వెల్లడి
దివంగత నేత వంగవీటి మోహనరంగా కుమార్తె వంగవీటి ఆశాలత తన రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టారు. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. ఆదివారం మార్కాపురం జిల్లా కంభం చెరువును సందర్శించిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడి ఈ విషయంపై స్పష్టతనిచ్చారు.

కొంతకాలంగా తన రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు వస్తున్నాయని, కొందరు కావాలనే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆశాలత అన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని అభిమానులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తన పూర్తి దృష్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 'రాధా-రంగా మిత్రమండలి'ని ఏకతాటిపైకి తీసుకువచ్చి, సంస్థను బలోపేతం చేయడంపైనే ఉందని తెలిపారు.

రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి తనకు ఉన్నప్పటికీ, దానికి ఇంకా సమయం ఉందని ఆశాలత పేర్కొన్నారు. భవిష్యత్తులో రాజకీయాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా.. తనను నమ్ముకున్న అభిమానులు, శ్రేయోభిలాషుల అభిప్రాయాలను తీసుకున్నాకే ముందుకు వెళ్తానని ఆమె తేల్చి చెప్పారు. ఇప్పటికే ఆమె సోదరుడు వంగవీటి రాధా రాజకీయాల్లో చురుగ్గా ఉండగా, ఇప్పుడు ఆశాలత కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తుండటం ఏపీ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.


More Telugu News