ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సస్పెన్షన్ పొడిగింపు... పదవీ విరమణ వరకూ వేటు!

  • ఐపీఎస్ సునీల్ కుమార్‌పై కొనసాగనున్న సస్పెన్షన్
  • ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
  • రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రధాన ఆరోపణలు
  • సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వాదన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి, సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటును మరోసారి పొడిగించింది. ఆయనపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణ ముగిసే వరకు లేదా ఆయన పదవీ విరమణ చేసే తేదీ వరకు (ఏది ముందైతే అది) సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

1993 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సునీల్ కుమార్ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ అడిషనల్ డీజీగా, ఆ తర్వాత సీఐడీ చీఫ్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో, అప్పటి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణలపై గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఆయనపై క్రిమినల్ కేసు (క్రైమ్ నెం. 187/2024) నమోదైంది. ప్రస్తుతం ఈ కేసు ఏసీబీ కోర్టులో విచారణ దశలో ఉంది.

ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో సునీల్ కుమార్‌ను తిరిగి సర్వీసులోకి తీసుకుంటే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, దర్యాప్తు పారదర్శకంగా సాగేందుకు సస్పెన్షన్ పొడిగింపు తప్పనిసరి అని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. వీటితో పాటు, ప్రభుత్వ అనుమతి లేకుండా 2020 నుంచి 2024 మధ్య పలుమార్లు విదేశాలకు వెళ్లడం, అగ్రిగోల్డ్ నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలపై కూడా ఆయన ఏసీబీ విచారణను ఎదుర్కొంటున్నారు.

ఆల్ ఇండియా సర్వీసెస్ (డిసిప్లిన్ & అప్పీల్) రూల్స్, 1969లోని రూల్ 3(3) ప్రకారం ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సునీల్ కుమార్ పదవీ విరమణ తేదీ 2026 జూన్ 30 కావడంతో, అప్పటివరకు కేసుల విచారణ పూర్తికాకపోతే ఆయన సర్వీసులో చేరకుండానే రిటైర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


More Telugu News