యూత్ కాంగ్రెస్ షర్ట్ లెస్ నిరసనపై తీవ్రస్థాయిలో స్పందించిన ప్రధాని మోదీ

  • ఏఐ సదస్సులో కాంగ్రెస్ నగ్న రాజకీయాలు చేసిందన్న ప్రధాని
  • కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతికంగా దివాలా తీసిందని విమర్శ
  • విదేశీ అతిథుల ముందు దేశం పరువు తీశారని ఫైర్
  • కాంగ్రెస్‌ను విమర్శించిన ఇండియా కూటమి భాగస్వాములకు మోదీ ధన్యవాదాలు
ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో జరిగిన 'ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026'లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి నిరసన తెలపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. దేశంలోనే అత్యంత పురాతన పార్టీ అయిన కాంగ్రెస్ సైద్ధాంతికంగా దివాలా తీసిందని ఈ ఘటన స్పష్టం చేస్తోందని ఆదివారం మీరట్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో విమర్శించారు.

కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఈ అంతర్జాతీయ సదస్సులో, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై యూత్ కాంగ్రెస్ సభ్యులు ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ ఘటనపై మోదీ స్పందిస్తూ, "భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ప్రజలు కష్టపడుతుంటే, దేశ ప్రగతిని కొన్ని పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సదస్సును భారత్ నిర్వహించడం ప్రతి ఒక్కరికీ గర్వకారణం. కానీ కాంగ్రెస్ ఈ ప్రపంచ వేదికను తమ నీచ, నగ్న రాజకీయాలకు వాడుకుంది" అని అన్నారు.

"విదేశీ అతిథుల ముందు కాంగ్రెస్ నేతలు నగ్నంగా నిలబడ్డారు. అసలు మీ నగ్నత్వం దేశానికి ఇప్పటికే తెలుసు, మళ్లీ కొత్తగా బట్టలు విప్పాల్సిన అవసరం ఏముంది?" అని ప్రధాని ప్రశ్నించారు. సొంత దేశం పరువు తీయడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు తన సమాధి తవ్వాలని చూడటం, తన తల్లిని దూషించడం వంటివి చేస్తున్నారని, అయితే దేశ ప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమంలో ఇలా ప్రవర్తించడం హద్దులు మీరడమేనని అన్నారు.

దేశం పరువు తీసిన వారిని విమర్శించాల్సింది పోయి, కాంగ్రెస్ అగ్రనేతలు ఆ నిరసనకారులను ప్రశంసించడం దురదృష్టకరమని మోదీ వ్యాఖ్యానించారు. అయితే, ఈ ఘటనపై కాంగ్రెస్‌ను విమర్శించిన ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.


More Telugu News