వర్షార్పణమైన కీలక మ్యాచ్.. పాకిస్థాన్ సెమీస్ ఆశలు సంక్లిష్టం

  • పాక్-న్యూజిలాండ్ సూపర్-8 మ్యాచ్ వర్షంతో రద్దు
  • ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయింపు
  • క్లిష్టంగా మారిన పాకిస్థాన్, కివీస్ సెమీస్ అవకాశాలు
  • తదుపరి మ్యాచ్‌లకు కూడా వర్షం ముప్పు
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. శ్రీలంక వేదికగా శనివారం జరగాల్సిన కీలక సూపర్-8 మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దీంతో అంపైర్లు ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. సూపర్-8 దశకు రిజర్వ్ డే లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

కొలంబోలో చిరుజల్లుల మధ్య టాస్ వేశారు. టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, కొద్దిసేపటికే వర్షం భారీగా పెరగడంతో మైదానమంతా నీటితో నిండిపోయింది. ఎంతకీ వాన తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మ్యాచ్ కోసం పాక్ జట్టులో ఫఖర్ జమాన్, కివీస్ జట్టులో కెప్టెన్ సాంట్నర్, ఫెర్గూసన్, ఇష్ సోధీ తిరిగి చేరారు.


ప్రస్తుతం ఒక పాయింట్‌తో ఉన్న పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే తదుపరి రెండు మ్యాచ్‌లలో తప్పక గెలవాలి. ఇంగ్లాండ్, శ్రీలంకలపై గెలిస్తే 5 పాయింట్లతో నేరుగా సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఒక మ్యాచ్ మాత్రమే గెలిస్తే, 3 పాయింట్లతో ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. రెండింటిలోనూ ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించడం ఖాయం.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 24న ఇంగ్లండ్‌తో పాకిస్థాన్ ఆడబోయే మ్యాచ్ ఇరు జట్లకు వర్చువల్ నాకౌట్‌గా మారింది. అయితే కొలంబోలో వాతావరణం ఆందోళనకరంగా ఉండటంతో తదుపరి మ్యాచ్‌లకు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్ రోజు కూడా 40 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.


More Telugu News