ప్రియురాలితో గడిపేందుకు భర్త కిడ్నాప్ డ్రామా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య

  • పబ్‌లో పని చేస్తున్న ఉప్పల్‌కు చెందిన పూర్ణచందర్ రావు
  • కొన్నాళ్లుగా బెంగాలి యువతితో సహజీవనం
  • ఆమెతో గడిపేందుకు కిడ్నాప్ డ్రామా ఆడిన భర్త
  • కిడ్నాప్‌గా భావించి పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య
ప్రియురాలితో గడిపేందుకు హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి కిడ్నాప్ డ్రామా ఆడాడు. ఈ ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతాపూర్ డివిజన్ గాంధీనగర్‌లో చోటు చేసుకుంది. జనప్రియ అపార్టుమెంట్‌లో ఉంటున్న పూర్ణచందర్ రావుకు భార్య, తొమ్మిదేళ్ల కూతురు ఉంది. అతను మాదాపూర్‌లోని ఓ పబ్‌లో పని చేస్తున్నాడు. 

రెండు రోజుల క్రితం రాత్రి స్నేహితులు వచ్చారని చెప్పి తన ఫోన్‌ను ఇంట్లోనే ఉంచి బయట గడియ పెట్టి వెళ్లిపోయాడు. నడుచుకుంటూ వచ్చిన ఇద్దరు అమ్మాయిలు, మరో వ్యక్తితో కలిసి పూర్ణచందర్ రావు వెళ్లిపోయాడు. ఉదయం నిద్రలేచిన భార్య, భర్త కనిపించకపోవడంతో ఆందోళన చెంది అపార్టుమెంట్‌లోని సీసీటీవీ ఫుటేజీ చూసింది. భర్త ఇద్దరు యువతులు, ఒక యువకుడితో కలిసి వెళ్లడంతో కిడ్నాప్‌గా భావించింది.

ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే మాదాపూర్ వెళ్లి భర్త పని చేసే పబ్‌ నిర్వాహకులకు సమాచారం అందించడంతో వారు మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సీసీటీవీ ఫుటేజీలోని ఒక యువతి ఆచూకీ దొరకగా ఆమెను విచారించడంతో అసలు విషయం వెలుగు చూసింది. పబ్‌లో పని చేస్తున్న బెంగాళీ యువతితో గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడని తెలిపింది. ఈ క్రమంలో ఆమెతో గడిపేందుకు పబ్‌లో తనతో కలిసి పని చేసే యువతులతో కిడ్నాప్ డ్రామా భర్త ఆడినట్లుగా గుర్తించారు. వారి ఫోన్ నెంబర్ లొకేశన్‌ను పరిశీలించి ఒడిశాలో ఉన్నట్లు గుర్తించారు.


More Telugu News