Pakistan Terrorist Attack: పాక్ లో ఉగ్రదాడి... 16 మంది మృతి

Pakistan Terrorist Attack 16 Killed in Khyber Pakhtunkhwa
  • పాక్‌లో సైనిక కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి
  • ఈ దాడిలో లెఫ్టినెంట్ కల్నల్ సహా ఇద్దరు సైనికులు మృతి
  • భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని బన్ను జిల్లాలో శనివారం సైనిక కాన్వాయ్‌ లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇద్దరు పాక్ సైనికులు, ఐదుగురు ఉగ్రవాదులు సహా మొత్తం 16 మంది మరణించారు. మృతుల్లో  లెఫ్టినెంట్ కల్నల్ స్థాయి అధికారితో పాటు పౌరులూ ఉన్నట్లు సమాచారం.  పలువురు సైనికులు గాయపడ్డారు. 15 రోజుల వ్యవధిలో ఇది మూడో ఆత్మాహుతి దాడి. 

నిఘా వర్గాల సమాచారంతో బన్ను జిల్లాలో భద్రతా దళాలు ఆపరేషన్ చేపట్టాయి. బన్ను నగరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు సిద్ధమైన ఓ ఆత్మాహుతి దళ సభ్యుడిని, ఉగ్రవాదులను సైన్యం అడ్డుకుంది. ఈ క్రమంలో జరిగిన తీవ్రమైన కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం, ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నింపిన వాహనాన్ని సైనిక కాన్వాయ్‌లోని ఒక వాహనంపైకి నడిపి ఢీకొట్టారు. ఈ ఘటనలో లెఫ్టినెంట్ కల్నల్ షాజాదా గుల్ అమరులయ్యారని సమాచారం. 

అయితే, ఇటీవలి కాలంలో పాక్‌లో ఉగ్రదాడులు పెరిగాయి. కొద్దిరోజుల క్రితం బజౌర్ జిల్లాలోని ఓ చెక్ పాయింట్ వద్ద మరో ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడు పదార్ధాలతో కూడిన వాహనం ఢీకొట్టడంతో ఆ సమయంలో 11 మంది సైనిక సిబ్బంది సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే మలంగిలోని ఓ మదర్సా ఉన్న భవనం వద్ద కూడా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి భవనం పూర్తిగా ధ్వంసం అవ్వడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని భవనాలు, అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి.  
Pakistan Terrorist Attack
Khyber Pakhtunkhwa
Bannu district
Suicide bombing
Pakistan military
Shahzada Gul
Bajaur district
Terrorism in Pakistan
Pakistan security forces
Military convoy

More Telugu News