ఈ నెల 26 నుంచి జనసేన ఉద్యమి సభ్యత్వాలు.. నాదెండ్ల మనోహర్ కీలక సూచనలు
- పార్టీ నేతలతో నాదెండ్ల మనోహర్ టెలీకన్ఫరెన్స్
- క్షేత్రస్థాయిలో భారీగా సభ్యత్వాలు చేయించాలని సూచన
- జెన్ జీని పార్టీకి దగ్గర చేయాలన్న నాదెండ్ల
జనసేన పార్టీ బలోపేతం దిశగా ఆ పార్టీ మరో కీలక అడుగు వేస్తోంది. జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 26న ప్రారంభం కానుంది. ఈ ప్రణాళికపై పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన జనసేన అగ్రనేత, మంత్రి నాదెండ్ల మనోహర్... క్షేత్రస్థాయిలో భారీగా సభ్యత్వాలు చేయించాలని సూచించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు.
రెండు వారాల సమయాన్ని వినియోగించుకుని సమష్టిగా భారీగా సభ్యత్వాలను చేయించేలా లక్ష్యాలు పెట్టుకోవాలని అన్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించనున్నట్టు తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు సేకరించి స్పష్టమైన నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు. స్థానిక సమస్యల పరిష్కారంలో చొరవ చూపితే పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పారు. జెన్ జీని పార్టీకి దగ్గర చేయాలని... కొత్త సభ్యుల చేరికపై దృష్టి పెట్టాలని సూచించారు. గతంలో 12.6 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని... ఈసారి రెట్టింపు సభ్యత్వాలు లక్ష్యంగా పెట్టుకోవాలని తెలిపారు.