మహిళల డ్రెస్సింగ్ వివాదం.. మరోసారి స్పందించిన నటుడు శివాజీ

  • ఆరోజు మాట్లాడే సమయంలో రెండు పదాలు పొరపాటున దొర్లాయని వెల్లడి
  • గతంలోనూ ఇదే విషయం చెప్పానన్న నటుడు శివాజీ
  • ఆరోజు అలా ఎందుకు మాట్లాడానో తెలియడం లేదన్న శివాజీ
మహిళల డ్రెస్సింగ్ విషయంలో కొద్ది నెలల క్రితం తాను చేసిన వ్యాఖ్యలపై నటుడు శివాజీ మరోసారి స్పందించారు. మహిళల వేషదారణ విషయంలో ఆ రోజు తాను మాట్లాడిన సమయంలో రెండు పదాలు పొరపాటున దొర్లాయని అన్నారు. అవి వాడకుండా ఉండాల్సిందని తెలిపారు. ఇదే మాటను తాను గతంలో చెప్పానని, ఇప్పుడు కూడా చెబుతున్నానని అన్నారు. నేను ఎప్పుడు కూడా అదుపు తప్పి మాట్లాడలేదని శివాజీ అన్నారు.

అయితే ఆ రోజు అలా ఎందుకు మాట్లాడానో తనకు తెలియడం లేదని వ్యాఖ్యానించారు. అన్ని రోజులు మనవి కాదని మరోసారి అర్థమైందని అన్నారు. ఆ పదాలు ఎందుకు మాట్లాడానా అని నాకే కాస్త ఇబ్బందిగా అనిపించిందని పేర్కొన్నారు. ఆ సమయంలో తాను మానసిక సంఘర్షణకు గురయ్యానని, మూడు రోజులు నిద్ర కూడా పోలేదని గుర్తుచేసుకున్నారు. ఇప్పటి వరకు కొన్ని వందల ప్రెస్ మీట్లు, డిబేట్‌లలో మాట్లాడినా ఎప్పుడూ నోరు జారలేదని పేర్కొన్నారు. ఆరోజు మాత్రం అనుకోకుండా అలా జరిగిపోయిందని అన్నారు.

తాను యాంకర్ అనసూయను కూడా ఏమీ అనలేదని వెల్లడించారు. ఆమెతో తనకు పరిచయం కూడా అంతగా లేదని పేర్కొన్నారు. అనసూయను గతంలో ఎప్పుడో ఒకసారి ఇంటర్వ్యూ చేశానని, అంతకుమించి పెద్దగా పరిచయం లేదని తెలిపారు. ఆమె అంటే తనకు గౌరవం ఉందని తెలిపారు. మగవారు ఎవరు కూడా ఆడవారిని కావాలని ఉద్దేశపూర్వకంగా కించపరచాలని అనుకోరని వ్యాఖ్యానించారు.

తనకు తెలిసిన వాళ్లే మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారని తెలిసి షాకయ్యానని శివాజీ అన్నారు. తనపై ఎవరు ఫిర్యాదు చేశారో తెలుసని, వారి పేర్లు బయటకు చెప్పలేనని, అలా చెప్పడం కరెక్టు కాదని పేర్కొన్నారు. తనపై ఫిర్యాదు చేసినప్పటికీ వారంటే తనకు ఇప్పటికీ గౌరవం ఉందని శివాజీ అన్నారు.


More Telugu News