90 ఏళ్లలో లేని పన్నుల బాదుడు: అమెరికాకు రూ. 26 లక్షల కోట్ల రాబడి

  • ట్రంప్ తీరుతో అమెరికాలో భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు
  • పాక్షికంగానే నెరవేరిన ట్రంప్ లక్ష్యం
  • తప్పిన ట్రంప్ ఉద్యోగాల అంచనా
  • 1932 తర్వాత అమెరికా చరిత్రలో ఇవే అత్యంత కఠినమైన పన్ను విధానాలంటున్న నిపుణులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న 'అమెరికా ఫస్ట్' ఆర్థిక విధానాలు ఆ దేశ వాణిజ్య ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువులపై ఆయన విధించిన భారీ సుంకాల వల్ల గత ఏడాది కాలంలో అమెరికా ఖజానాకు అక్షరాలా 287 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 26 లక్షల కోట్లు) అదనపు ఆదాయం సమకూరింది. 2024 ఏప్రిల్‌లో భారత్ సహా పలు దేశాలపై సగటున 17 శాతం వరకు సుంకాలు విధించడంతో, గతంతో పోలిస్తే పన్నుల రాబడి ఏకంగా మూడు రెట్లు పెరగడం విశేషం. 1932 తర్వాత అమెరికా చరిత్రలో ఇవే అత్యంత కఠినమైన పన్ను విధానాలని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అయితే, ఈ సుంకాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం మాత్రం పాక్షికంగానే నెరవేరింది. అమెరికాకు ఇతర దేశాలతో ఉన్న వాణిజ్య లోటు గణనీయంగా తగ్గి, 2009 నాటి కనిష్ట స్థాయికి చేరుకున్నప్పటికీ, స్థానిక తయారీ రంగం మాత్రం ఆశించిన స్థాయిలో పుంజుకోలేదు. సొంత దేశంలో పరిశ్రమలు పెరిగి ఉద్యోగాల కల్పన జరుగుతుందని ట్రంప్ ప్రభుత్వం భావించినా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ పరిశ్రమపై ఈ పన్నుల ప్రభావం తీవ్రంగా పడటంతో ఆ రంగం ఒత్తిడికి లోనవుతోంది.

మరోవైపు, ఈ పన్నుల భారం అంతిమంగా అమెరికా సామాన్య ప్రజల జేబులకే చిల్లు పెట్టింది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడంతో, ఒకానొక దశలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయికి చేరింది. సుమారు 51 శాతం మంది ప్రజలు ఈ సుంకాల వల్ల తమ జీవనం భారమైందని వాపోతున్నట్లు తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా సుప్రీంకోర్టు తాజాగా ట్రంప్ తీసుకున్న కొన్ని ఏకపక్ష నిర్ణయాలను కొట్టివేయడం ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


More Telugu News