చెన్నై నగరాన్ని చాలా మిస్ అవుతున్నాను: ప్రభాస్

  • చెన్నైతో తనకున్న విడదీయరాని బంధాన్ని పంచుకున్న ప్రభాస్
  • తాను పుట్టింది, చదువుకున్నది చెన్నైలోనేనని వెల్లడి
  • తెలుగు ఇండస్ట్రీలోని తమిళ టెక్నీషియన్ల వల్లే తన భాష మెరుగైందన్న హీరో
  • 'కపుల్ ఫ్రెండ్లీ' చిత్ర బృందంతో మాట్లాడుతూ పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న స్టార్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తాను పుట్టి పెరిగిన చెన్నై నగరంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్‌కు రాకముందు తన బాల్యం అక్కడే గడిచిందని, అప్పుడప్పుడు ఆ నగరాన్ని చాలా మిస్ అవుతుంటానని తెలిపారు.

ఇటీవల హిట్టయిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్ర బృందంతో ప్రభాస్ ముచ్చటించారు. ఈ సినిమాలో సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించారు. సినిమా కథలో ఎక్కువ భాగం చెన్నై నేపథ్యంలో సాగుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్.. "మీరు చెన్నై నుంచి ఇక్కడికి వచ్చారని విన్నాను. చెన్నై గురించి మీకేం గుర్తుంది?" అని ప్రభాస్‌ను అడిగారు.

దీనికి ప్రభాస్ బదులిస్తూ, "నేను పుట్టింది అక్కడే. చెన్నైలోని డాన్ బాస్కో స్కూల్‌లో చదువుకున్నాను. హైదరాబాద్ వచ్చాక తమిళం దాదాపు మర్చిపోయాను. కానీ, రాజు మాస్టర్, ప్రభు మాస్టర్ వంటి వారితో పాటు తెలుగు పరిశ్రమలో పనిచేసే చాలా మంది టెక్నీషియన్లు తమిళులే. వారితో మాట్లాడుతూ ఉండటం వల్ల నా తమిళం మళ్లీ మెరుగైంది. ఇప్పటికీ చెన్నై వెళ్లినప్పుడు డాన్ బాస్కో స్కూల్ ను చూస్తుంటాను. ఆ నగరం నాకెంతో ఇష్టం" అని తన జ్ఞాపకాలను పంచుకున్నారు.

‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాను యూవీ కాన్సెప్ట్స్ పతాకంపై అజయ్ కుమార్ రాజు నిర్మించగా, యూవీ క్రియేషన్స్ సమర్పిస్తోంది. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఒక జంట కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.


More Telugu News