Dev Ji: భద్రతా బలగాల భారీ ఆపరేషన్.. మావోయిస్టు అగ్రనేతలే టార్గెట్!

Chhattisgarh Telangana Border Operation Targets Maoist Leaders Like Dev Ji
  • ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దులో ‘ఆపరేషన్ కేజీహెచ్-2’ ప్రారంభం
  • మావోయిస్టు అగ్రనేతలు దేవ్ జీ, కేసా సోధిలే ప్రధాన లక్ష్యం
  • కూంబింగ్‌లో పాల్గొంటున్న 2000 మంది భద్రతా సిబ్బంది
  • 2026 నాటికి మావోయిజాన్ని నిర్మూలించాలనే లక్ష్యంలో భాగంగా ఆపరేషన్
  • తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో పోలీసుల అప్రమత్తత
ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల ఏరివేతకు భద్రతా బలగాలు మరో భారీ ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టాయి. ‘ఆపరేషన్ కేజీహెచ్-2’ (కర్రెగుట్ట హిల్స్-2) పేరుతో మంగళవారం సాయంత్రం నుంచి ఈ కూంబింగ్ మొదలైంది. సుమారు 2,000 మంది సీఆర్పీఎఫ్, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు ఇందులో పాల్గొంటున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు దేవ్ జీ (తిప్పరి తిరుపతి), అతడి సహాయకుడు కేసా సోధిలే లక్ష్యంగా ఈ వేట కొనసాగుతోంది.

2026 మార్చి 31 నాటికి దేశం నుంచి వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. బీజాపూర్ జిల్లా నంబి నుంచి విస్తరించిన కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో మావోయిస్టు ముఖ్య నేతలు ఉన్నారనే పక్కా సమాచారంతో బలగాలు ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. సీఆర్పీఎఫ్, కోబ్రా, డీఆర్జీ సంయుక్త బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి.

గత ఏడాది ఏప్రిల్‌లో ఇదే కర్రెగుట్టల ప్రాంతంలో నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. అయితే, అప్పుడు కొందరు అగ్రనేతలు తప్పించుకున్నారు. ఆ తర్వాత బలగాలు ఈ ప్రాంతంలో ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్‌‌లను (FOB) ఏర్పాటు చేసి పట్టు బిగించాయి. ఈ ఆపరేషన్ మంగళవారం సాయంత్రం ప్రారంభమైనట్లు సీఆర్పీఎఫ్ వర్గాలు ధ్రువీకరించాయని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ తన కథనంలో పేర్కొంది.

తాజా పరిణామాల నేపథ్యంలో, ఛత్తీస్‌గఢ్‌కు సరిహద్దుగా ఉన్న తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేసి, అనుమానితుల కదలికలపై నిఘా పెంచారు.
Dev Ji
Chhattisgarh
Telangana
Maoists
anti Maoist operation
Bijapur district
Karegutta Hills
CRPF
left wing extremism
security forces

More Telugu News