Leena Nair: భారత ప్రతిభకు ఫ్రాన్స్ ఫిదా.. 'షానెల్' సీఈవో లీనాపై మెక్రాన్ ప్రశంసలు!

భారత పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ భారత ప్రతిభపై ప్రశంసల వర్షం కురిపించారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రపంచంలోని దిగ్గజ సంస్థలను భారతీయులే నడిపిస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా, ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ 'షానెల్' సీఈవోగా మహారాష్ట్రకు చెందిన లీనా నాయర్ ఉండటం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వంటి వారిని ప్రస్తావించిన మెక్రాన్, మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో పుట్టిపెరిగిన లీనా నాయర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. "భారత్ కేవలం ఆవిష్కరణల్లో భాగస్వామి మాత్రమే కాదు, ప్రపంచానికే నాయకత్వం వహిస్తోంది" అని ఆయన వ్యాఖ్యానించినప్పుడు ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్ చిరునవ్వులు చిందించారు.

ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య సంబంధాలు 'ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి చేరాయి. రక్షణ, వాణిజ్యం, కీలక ఖనిజాల వంటి రంగాల్లో కలిసి పనిచేయాలని భారత్, ఫ్రాన్స్ నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగా కర్ణాటకలోని వేమగల్‌లో ఎయిర్‌బస్-టాటా భాగస్వామ్యంతో నిర్మించనున్న H-125 హెలికాప్టర్ల అసెంబ్లీ లైన్‌ను ఇరు దేశాల అధినేతలు వర్చువల్‌గా ప్రారంభించారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఘర్షణల నడుమ భారత్-ఫ్రాన్స్ మైత్రి ప్రపంచ శాంతికి, స్థిరత్వానికి ఒక శక్తిగా నిలుస్తుందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా తెలిపారు.

కాగా, ముంబై పర్యటన ముగించుకుని మెక్రాన్ ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ జరిగే 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'లో పాల్గొంటారు. 2026ను 'భారత్-ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్'గా ప్రకటించడం, 114 రాఫెల్ విమానాల తయారీపై చర్చలు తుది దశకు చేరడం ఈ పర్యటనలోని మరికొన్ని కీలక పరిణామాలు.
Leena Nair
Emmanuel Macron
France
India
Chanel CEO
Sundar Pichai
Satya Nadella
India France Relations
Strategic Partnership
H-125 Helicopters

More Telugu News