టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో భారీ చోరీ

  • చింతలపూడిలోని నివాసంతో తెల్లవారుజామున చోరీ
  • 50 సవర్ల బంగారం, 10 కిలోల వెండి, రూ. 1 లక్ష నగదు అపహరణ
  • చింతలపూడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
పొన్నూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలాదేవి నివాసంలో భారీ చోరీ జరిగింది. చింతలపూడిలోని నివాసంలో ఈ తెల్లవారుజామున దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ జరిగినట్టు సమాచారం.

ఉదయాన్నే పనులకు వచ్చిన పనిమనుషులు ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని గమనించారు. ఇదేదో దొంగల పనే అయి ఉంటుందని అనుమానించారు. వెంటనే ప్రమీలాదేవికి విషయం తెలియజేయగా ఆమె ఇంట్లో నగలు, డబ్బు ఉంచిన ప్రదేశాన్ని తనిఖీ చేశారు. అక్కడ ఏమీ లేకపోవడంతో వెంటనే చింతలపూడి పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు.


ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం... 50 సవర్ల బంగారం, 10 కిలోల వెండి, రూ.1 లక్ష నగదు చోరీకి గురయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంటి పనిమనుషులను, చుట్టుపక్కల వారిని, అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఇంటి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ చోరీ వ్యవహారం స్థానికంగా కలకలం రేపుతోంది. 



More Telugu News