మేయర్, డిప్యూటీ మేయర్ టర్మ్ పూర్తయ్యేలోపు బీజేపీ పీఠం ఎక్కుతుంది... ఇది నా మాట!: ధర్మపురి అర్వింద్

  • నిజామాబాద్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పొత్తు పెట్టుకున్నాయన్న అర్వింద్
  • మూడు పార్టీలు కలిసి బీజేపీని ఓడించాయని వ్యాఖ్య
  • కల్వకుంట్ల కుటుంబాన్ని రేవంత్ ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్న

నిజామాబాద్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు అనైతిక పొత్తు పెట్టుకున్నాయని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మూడు పార్టీలు కలిసి బీజేపీని ఓడించి కార్పొరేషన్ ను కైవసం చేసుకున్నాయని మండిపడ్డారు. స్వల్ప మెజార్టీతో తాము మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కోల్పోయామని చెప్పారు. ఈ మేయర్, డిప్యూటీ మేయర్ టర్మ్ పూర్తి కాకముందే మేయర్ పీఠాన్ని బీజేపీ ఎక్కుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.


“ఇది నా మాటగా చెబుతున్నాను. మేయర్, డిప్యూటీ మేయర్ టర్మ్ ముగిసేలోపు సీన్ రివర్స్ చేసి చూపిస్తాం” అని అర్వింద్ అన్నారు. ఇక్కడికి అక్బరుద్దీన్ ఒవైసీ వచ్చి హిందువులను దూషించినా... ఆత్మాభిమానాన్ని చంపుకుని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంతో కలిసిపోయాయని తీవ్ర విమర్శలు చేశారు.


కాళేశ్వరం, కార్ రేస్, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కల్వకుంట్ల కుటుంబాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. ఈ పొత్తుల వెనుక ఆ రహస్యాలు దాగున్నాయని ఆరోపించారు.


పోలీసులు కూడా రాజకీయ రంగుపులుముకుని బీఆర్ఎస్ కార్పొరేటర్‌ను ఎత్తుకెళ్లి కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేలా చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. కరీంనగర్‌లో మేయర్ ఓటింగ్‌కు దూరంగా ఉన్న బీఆర్ఎస్... నిజామాబాద్‌లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడంపై కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. “కరీంనగర్ మీదనే ఎందుకు ప్రేమ? నిజామాబాద్ మీద ఎందుకు లేదు?” అని ప్రశ్నించారు. కేటీఆర్, రేవంత్ రెడ్డిలకు నార్కో పరీక్షలు చేస్తే నిజం బయటపడుతుందని అన్నారు.



More Telugu News