మాజీ ఎంపీ తడపట్ల రత్నాబాయి కన్నుమూత
- నిన్న రాత్రి కన్నుమూసిన తడపట్ల రత్నాబాయి
- రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో కన్నుమూత
- పీసీసీ సభ్యుడిగా ఉన్న రత్నాబాయి భర్త
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో మరో విషాదం చోటుచేసుకుంది. రాజ్యసభ మాజీ సభ్యురాలు, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు తడపట్ల రత్నాబాయి నిన్న రాత్రి కన్నుమూశారు. ఆమె వయసు 79 ఏళ్లు. తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమెను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించగా, అక్కడే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
1972లో రత్నాబాయి రాజకీయ ప్రస్థానం మొదలయింది. రంపచోడవరం (ఎల్లవరం) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మొదటిసారి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2007లో జీసీసీ చైర్మన్గా, 2009లో రాజ్యసభ సభ్యురాలిగా, 2014లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకురాలుగా ఎదిగిన ఆమె, అనారోగ్య కారణాలతో రాజకీయాలకు కొంతకాలంగా దూరంగా ఉంటూ వ్యక్తిగత జీవితం గడుపుతున్నారు.
రత్నాబాయి మృతి చెందిన వార్తతో కాంగ్రెస్ పార్టీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆమె భర్త పీసీసీ సభ్యుడిగా ఉన్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రత్నాబాయి మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలుపుతున్నారు.