బిల్ గేట్స్‌కు గన్నవరంలో మంత్రి లోకేశ్ ఘన స్వాగతం

  • ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న బిల్ గేట్స్
  • బిల్ గేట్స్ ‌కు స్వాగతం పలికిన మంత్రులు నారా లోకేశ్, అనిత, అచ్చెన్నాయుడు సత్యకుమార్ యాదవ్
  • సచివాలయం వద్ద స్వాగతం పలకనున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత, కె.అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్‌తో పాటు జిల్లా అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బిల్ గేట్స్‌తో పాటు అధికారులు, మంత్రుల బృందం సచివాలయానికి బయల్దేరారు.  

ఈ పర్యటనలో బిల్ గేట్స్‌తో పాటు ఫౌండేషన్‌కు చెందిన ఆరుగురు ప్రతినిధుల బృందం కూడా సచివాలయానికి రానుంది. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ‌తో వారు సమావేశమవుతారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (ఆర్టీజీఏస్)ను బిల్ గేట్స్ సందర్శించనున్నారు. ఆర్టీజీఎస్ ద్వారా అమలవుతున్న విధానాలు, అందుతోన్న ఫలితాలను సీఎం చంద్రబాబు గేట్స్‌కు వివరించనున్నారు. 

అనంతరం సీఎం, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు బిల్ గేట్స్ బృందంతో సమావేశమై.. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అమలు చేస్తున్న ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై కీలక చర్చలు జరపనున్నారు.


More Telugu News