అమెరికాలో ఆచూకీ లేకుండా పోయిన భారతీయ విద్యార్థి

  • అమెరికాలో ఉన్నత చదువులకు వెళ్లిన భారత విద్యార్థి అదృశ్యం
  • కాలిఫోర్నియా బర్కిలీ యూనివర్సిటీ విద్యార్థి సాకేత్ మిస్సింగ్
  • ఐదు రోజులుగా కొనసాగుతున్న గాలింపు చర్యలు.. లభించని ఆచూకీ
  • రంగంలోకి దిగిన భారత కాన్సులేట్.. అధికారులతో సంప్రదింపులు
అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన భారతీయ విద్యార్థి అదృశ్యమవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటకకు చెందిన 22 ఏళ్ల సాకేత్ శ్రీనివాసయ్య గత ఐదు రోజులుగా కనిపించకుండా పోయాడు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ (UC Berkeley)లో చదువుతున్న అతను ఫిబ్రవరి 9న అదృశ్యమవ్వగా, అతని కోసం ఐదు రోజులుగా గాలిస్తున్నారు. అయినప్పటికీ అతని ఆచూకీ ఇప్పటివరకు లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

వివరాల్లోకి వెళితే, సాకేత్ శ్రీనివాసయ్య చివరిసారిగా యూనివర్సిటీ క్యాంపస్‌కు సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న టిల్డెన్ రీజినల్ పార్క్ సమీపంలో కనిపించినట్లు అధికారులు గుర్తించారు. అతని పాస్‌పోర్ట్, ల్యాప్‌టాప్‌తో కూడిన బ్యాక్‌ప్యాక్‌ను అతని నివాసం దగ్గర కనుగొన్నారు. బర్కిలీ నగర పోలీసులు, ఇతర అధికార యంత్రాంగం లేక్ అంజా, బర్కిలీ హిల్స్ పరిసర ప్రాంతాలతో పాటు నగరంలోనూ ముమ్మరంగా గాలిస్తున్నారు. హెలికాప్టర్లు, డ్రోన్ల సహాయంతో అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.

సాకేత్ విద్యాపరంగా ఎంతో ప్రతిభావంతుడు. 2025లో ప్రతిష్ఠాత్మక ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ పూర్తి చేశాడు. ప్రస్తుతం యూసీ బర్కిలీలో కెమికల్ అండ్ బయో మాలిక్యులర్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. సాకేత్ 2025లో ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ పూర్తి చేశాడు. హైపర్‌లూప్ టెక్నాలజీకి సంబంధించిన ఓ కూలింగ్ సిస్టమ్‌పై ఐదుగురితో కలిసి పేటెంట్ కూడా పొందడం అతని ప్రతిభకు నిదర్శనం.

ఈ ఘటనపై శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాము సాకేత్ కుటుంబ సభ్యులతో నిరంతరం టచ్‌లో ఉన్నామని, స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతూ గాలింపు చర్యలను వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల కాలంలో అమెరికాలో భారత విద్యార్థులపై దాడులు, అనుమానాస్పద మరణాలు, అదృశ్యం ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో తాజా సంఘటన మరోసారి తల్లిదండ్రుల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది. 


More Telugu News