కులం అనేది పుట్టుకతో వచ్చే విషయం, ఎంపిక చేసుకునేది కాదు: నాగబాబు

  • కులాలను కలపడమే జనసేన సిద్ధాంతమని నాగబాబు స్పష్టీకరణ
  • అనకాపల్లి, వైజాగ్ సౌత్ సీట్ల కేటాయింపే ఇందుకు నిదర్శనమన్న ఎమ్మెల్సీ
  • కాపులకు వైసీపీ చేసిన అన్యాయంపై ఆ పార్టీ నేతలు ఎందుకు మాట్లాడరని ప్రశ్న
  • అంబటిని ఐకాన్‌గా చూపడం వల్లే వైసీపీ నష్టపోయిందని విమర్శ
  • పాత చింతకాయ పచ్చడి రాజకీయాలు చేస్తే 11 సీట్లు కూడా రావని హెచ్చరిక
జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు, వైసీపీ నేతలపై, ముఖ్యంగా ఆ పార్టీలోని కాపు నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కులాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూసే వైసీపీ నేతలకు కాలం చెల్లిందని, ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న 11 సీట్లు కూడా దక్కవని ఆయన హెచ్చరించారు. జనసేన సిద్ధాంతాలను వివరిస్తూనే, వైసీపీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ ఆయన పలు సూటి ప్రశ్నలు సంధించారు.

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, "మన దేశంలో కులం అనేది ఒక సామాజిక వాస్తవికత. ఎవరు ఏ కులంలో పుడతారో, దాన్ని ఎప్పటికీ మార్చుకోలేం. కుల రహిత సమాజం అనేది ఒక ఉన్నతమైన ఆశయమే అయినా, రాజకీయాల్లో వాస్తవ పరిస్థితులను అంగీకరించాలి. అందుకే పవన్ కల్యాణ్ గారు 'కులాలను కలిపే ఆలోచనా విధానాన్ని' జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటిగా చేర్చారు. సమాజంలో అధిక సంఖ్యలో ఉన్న కులాలు, అల్పసంఖ్యాక కులాలను ప్రోత్సహించి పెద్దన్న పాత్ర పోషించాలి," అని అన్నారు. ఇందుకు ఉదాహరణగా, 40 శాతం కాపు జనాభా ఉన్న అనకాపల్లి స్థానాన్ని బీసీ వర్గానికి చెందిన కొనతాల రామకృష్ణకు కేటాయించామని, అక్కడ కాపులు, గౌరలు కలిసి పనిచేసి ఆ సీటును గెలిపించుకున్నారని గుర్తుచేశారు. అలాగే, విశాఖ సౌత్‌లో బీసీ యాదవ వర్గానికి చెందిన వంశీకృష్ణ యాదవ్‌కు టికెట్ ఇవ్వగా, రాష్ట్రంలోనే అత్యధిక ఓట్ల శాతంతో గెలిచారని, ఇది తమ సిద్ధాంత నిబద్ధతకు నిదర్శనమని నాగబాబు స్పష్టం చేశారు.

వైసీపీ నేతలపై విమర్శలు గుప్పిస్తూ, "నిజం మాట్లాడితే తల వెయ్యి ముక్కలయ్యే శాపం వైసీపీ నేతలకు ఉంది. వారు నోరు విప్పితే అబద్ధాలు, బూతులు తప్ప మరేమీ రావు. తాగుబోతులు, తిరుగుబోతులు అంటూ కాపు కులాన్ని కించపరిచే అంబటి రాంబాబు వంటి వారిని, వంగవీటి రంగా గారి ఫొటో పక్కన పెట్టి కాపు కుల ఐకాన్‌గా చూపాలని చూశారు. మీ ఈ ఆలోచనే మిమ్మల్ని ముంచింది" అని దుయ్యబట్టారు.

ఈ క్రమంలో వైసీపీ కాపు నేతలను ఉద్దేశించి నాగబాబు పలు ప్రశ్నలు లేవనెత్తారు. "గ్రేటర్ రాయలసీమలోని 6 జిల్లాల్లో 20 శాతం బలిజ, కాపులు ఉన్నా ఒక్క ఎంపీ సీటు, 74 అసెంబ్లీ సీట్లలో పర్చూరు తప్ప ఒక్క సీటూ ఎందుకు ఇవ్వలేదు? దీనిపై అంబటి, పేర్ని నాని వంటి వారు జగన్‌ను ఎప్పుడైనా ప్రశ్నించారా? తరతరాలుగా బలిజలు గెలుస్తున్న రాజంపేట ఎంపీ సీటును మిథున్ రెడ్డికి కట్టబెట్టినప్పుడు మీరెక్కడ ఉన్నారు?" అని నిలదీశారు. 

వంగవీటి రంగా గారిపై వైసీపీది కపట ప్రేమ అని, ఆయన కుమారుడు రాధాను పార్టీ నుంచి పంపించి, రంగా గారిని దూషించిన గౌతం రెడ్డికి పదవి కట్టబెట్టారని ఆరోపించారు. 'కాపు నేస్తం' పథకానికి వైఎస్సార్ పేరు పెట్టినప్పుడు, కాపు కులంలో పుట్టిన మహానుభావుల పేర్లు పెట్టాలని మీ నాయకుడిని ఎప్పుడైనా అడిగారా? అని ప్రశ్నించారు. "ఇది జెన్‍జి తరం. మీరు ఇంకా రాజనాల కాలం నాటి కుల రాజకీయాలు చేస్తే, ఈ 11 సీట్లు కూడా మిగలవు. ఆలోచించుకోండి" అని నాగబాబు హితవు పలికారు.




More Telugu News