పరువు పేరిట దౌర్జన్యం.. అల్లుడి ఇంటిని దగ్ధం చేసిన మామ

  • కూతురు కులాంతర వివాహం చేసుకుందని ఆగ్రహం
  • అల్లుడి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తండ్రి
  • మంచిర్యాల జిల్లా దాంపూర్ గ్రామంలో ఘటన
  • నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన పోలీసులు
కూతురు తమకు ఇష్టం లేని కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో ఓ తండ్రి అల్లుడి ఇంటికి నిప్పుపెట్టిన దారుణ సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. భీమారం మండలం దాంపూర్‌ గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాంపూర్‌ గ్రామానికి చెందిన జంగపెల్లి సురేందర్‌, అదే గ్రామానికి చెందిన అంజలి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వారు వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అంజలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సురేందర్‌ ఇంట్లో ఎవరూ లేని సమయంలో అక్కడికి వెళ్లి, ఇంటికి తాళం వేసి ఉండటంతో పెట్రోల్ పోసి నిప్పంటించారు.

మంటలను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు అంజలి కుటుంబ సభ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ వెంకటేశ్వర్‌, ఎస్‌ఐ రాజేందర్‌ వెల్లడించారు.


More Telugu News