గన్ మన్లు ఉన్నారు కాబట్టి సరిపోయింది... లేకుంటేనా!: మల్లారెడ్డి

  • లాల్‌గడి మలక్‌పేట‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ
  • సైబరాబాద్ సీపీని కలిసి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ పై ఫిర్యాదు చేసిన మల్లారెడ్డి
  • వంద మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా వచ్చి గొడవ సృష్టించారని ఆరోపణ 
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అలియాబాద్ మున్సిపల్ పరిధి లాల్‌గడి మలక్‌పేట‌లో చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై నిన్న ఆయన బీఆర్ఎస్ నేతలతో కలిసి సైబరాబాద్ సీపీని కలిసి ఫిర్యాదు చేశారు.
 

బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో తామంతా ప్రశాంతంగా కూర్చుని ఉన్న సమయంలో సుమారు వంద మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా వచ్చి గొడవ సృష్టించారని మల్లారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాలపై పెద్ద శబ్ధంతో పాటలు పెట్టి, కావాలనే రెచ్చగొట్టి ఘర్షణకు దిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ తన అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్ కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడ్డారని మల్లారెడ్డి మండిపడ్డారు. ఏసీపీ, సీఐల సమక్షంలోనే కోడిగుడ్లతో దాడులు జరుగుతున్నా పోలీసులు కేవలం చూస్తూ ఉండిపోయారని, అడ్డుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

తన గన్‌మెన్లు రక్షణగా లేకపోయి ఉంటే వజ్రేష్ యాదవ్ అనుచరులు మరింత తీవ్రంగా దాడి చేసి ఉండేవారని మల్లారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులను తీవ్రంగా ఖండించిన ఆయన, ఘటనకు బాధ్యుడైన వజ్రేష్ యాదవ్‌తో పాటు అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్‌ను కోరారు.

 


More Telugu News