Babubhai Prajapati: నిజంగా విషాదకరం అంటే ఇదే!

Babubhai Prajapati Wins Case Then Dies Day After Verdict
  • రూ.20 లంచం తీసుకున్నారంటూ 1996లో కేసు నమోదు
  • 30 ఏళ్ల న్యాయపోరాటం చేసిన మాజీ కానిస్టేబుల్
  • నాపై ఉన్న కళంకం పోయిందంటూ తీర్పు అనంతరం ఆనందం
  • విజయం సాధించిన మరుసటి రోజే గుండెపోటుతో మృతి
గుజరాత్‌లో తీవ్ర విషాదాన్ని నింపిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం రూ.20 లంచం తీసుకున్నారన్న ఆరోపణపై 30 ఏళ్ల పాటు న్యాయపోరాటం చేసిన ఓ మాజీ పోలీస్ కానిస్టేబుల్, నిర్దోషిగా తీర్పు వచ్చిన మరుసటి రోజే కన్నుమూశారు. న్యాయం కోసం దశాబ్దాలుగా ఎదురుచూసి, చివరికి గెలిచినా ఆ విజయాన్ని ఆస్వాదించలేకపోయిన ఆయన కథ అందరినీ కదిలిస్తోంది.

వివరాల్లోకి వెళితే, అహ్మదాబాద్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసిన బాబుభాయి ప్రజాపతిపై 1996లో రూ.20 లంచం తీసుకున్నారని అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో 2004లో సెషన్స్ కోర్టు ఆయనను దోషిగా తేల్చి, నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ బాబుభాయి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఆయన అప్పీల్ ఏకంగా 22 ఏళ్ల పాటు పెండింగ్‌లో ఉండిపోయింది.

సుదీర్ఘ విచారణ అనంతరం, ఈ ఏడాది ఫిబ్రవరి 4న హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. సాక్షుల వాంగ్మూలాల్లో పొంతన లేదని, ప్రాసిక్యూషన్ ఆరోపణలను నిరూపించడంలో విఫలమైందని పేర్కొంటూ బాబుభాయిని నిర్దోషిగా ప్రకటించింది. తీర్పు వచ్చిన వెంటనే బాబుభాయి తన న్యాయవాది నితిన్ గాంధీని కలిసి ఆనందం వ్యక్తం చేశారు. "నా జీవితంపై పడిన కళంకం ఇప్పుడు తొలగిపోయింది. దేవుడు నన్ను ఇప్పుడు తీసుకెళ్లినా ఫర్వాలేదు" అని ఆయన భావోద్వేగంతో అన్నట్లు న్యాయవాది తెలిపారు.

అయితే, ఆ సంతోషం ఒక్కరోజు కూడా నిలవలేదు. మరుసటి రోజే (ఫిబ్రవరి 5న) ఆయన గుండెపోటుతో సహజ మరణం పొందారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో గెలిచి, ఆ విజయాన్ని ఆస్వాదించకుండానే బాబుభాయి మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. 
Babubhai Prajapati
Gujarat
police constable
corruption case
bribery
court case
high court
heart attack
Ahmedabad
justice

More Telugu News