శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

  • ఈ నెల 8 నుంచి 18 వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
  • సీఎం చంద్రబాబును ఆహ్వానించిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, ఆలయ ప్రతినిధులు
  • భక్తులకు సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం ఆదేశం
  • మహానంది బ్రహ్మోత్సవాలకు కూడా ముఖ్యమంత్రికి అందిన ఆహ్వానం 
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ బోర్డు ఛైర్మన్ రమేశ్ నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు నేడు అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు.

ఈ సందర్భంగా వారు సీఎం చంద్రబాబుకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికతో పాటు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ పండితులు వేదమంత్రాలతో ఆయనకు ఆశీర్వచనం అందించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల గురించి ఎమ్మెల్యే, ఆలయ బోర్డు సభ్యులు ముఖ్యమంత్రికి వివరించారు.

దీనిపై స్పందించిన సీఎం, ఉత్సవాలకు వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు, భద్రత, రవాణా ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఇదే క్రమంలో, నంద్యాల జిల్లాలోని మహానంది క్షేత్రంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కూడా హాజరుకావాలని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి సీఎం చంద్రబాబును ఆహ్వానించారు.


More Telugu News