LV Subrahmanyam: శ్రీవారి నెయ్యి కోసం సొంత వ్యవస్థ ఉండాలి: ఎల్వీ సుబ్రహ్మణ్యం

LV Subrahmanyam Suggests Own Ghee System for Tirumala Temple
  • అమూల్ నమూనాలో రైతుల నుంచి పాలు సేకరించాలని ఎల్వీ సూచన 
  • గత ప్రభుత్వంలో జరిగింది క్షమించరాని మహాపచారమని వ్యాఖ్య 
  • బాధ్యులు తప్పు ఒప్పుకొని ప్రాయశ్చిత్తం చేసుకోవాలని డిమాండ్ 
తిరుమల శ్రీవారి నైవేద్యాల కోసం వినియోగించే నెయ్యి సరఫరాకు పకడ్బందీగా సొంత వ్యవస్థను ఏర్పాటు చేయాలని, దీని కోసం గుజరాత్‌లోని అమూల్ నమూనాను అనుసరించాలని టీటీడీ మాజీ కార్యనిర్వహణాధికారి (ఈవో), విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం సూచించారు. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాల రైతులను దేశీ ఆవుల పెంపకానికి ప్రోత్సహించి, వారి నుంచి పాలను సేకరించాలన్నారు. స్వామికి సమర్పించుకుంటున్నామనే భక్తిభావంతో రైతులు పాలు పోస్తారు కాబట్టి, ఆ పాలతో టీటీడీయే స్వయంగా నెయ్యి తయారుచేస్తే నాణ్యతకు ఢోకా ఉండదని, వేల రైతు కుటుంబాలకు ఉపాధి కూడా లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.   

గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి వాడారన్న వివాదం నేపథ్యంలో ఆయన ఈనాడుతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో జరిగింది క్షమించరాని మహాపచారం అని, మానవాళికే శాపమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తెలియక జరిగిన పొరపాటు కాదని, నెయ్యిలా కనిపించేందుకు ఏ రసాయనాలు కలపాలో వెతికి మరీ చేసిన నేరపూరిత కుట్ర అని ఆరోపించారు. 2022లోనే ల్యాబ్ పరీక్షల్లో నెయ్యి కల్తీ అని తేలినా, దాని వాడకాన్ని కొనసాగించడం క్షమించరానిదన్నారు.

"జంతు కొవ్వు కలపలేదు, రసాయనాలే కలిపాం అని సమర్థించుకోవడం సిగ్గుచేటు. ఇది అపచారం కాదా?" అని ఆయన నిలదీశారు. ఈ పాపానికి బాధ్యులైన వారు తమ వాదనలు ఆపి, తిరుమలకు వచ్చి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని డిమాండ్ చేశారు. దేవస్థానం వ్యవహారాల్లో ఈవో, ఛైర్మన్ ఇద్దరూ సమాన బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం, టీటీడీ బోర్డు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
LV Subrahmanyam
TTD
Tirumala
SriVari Laddu
Ghee Adulteration
Desi Cows
Chittoor
Nellore
Amul Model
Dairy Farming

More Telugu News