మున్సిపల్ ఎన్నికలు.. బీజేపీ మేనిఫెస్టో విడుదల

  • తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా
  • బీజేపీ గెలిస్తే పెండింగ్ పనుల్లో వెసులుబాటు కల్పిస్తామన్న రామచందర్ రావు
  • యువతకు వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేస్తామని హామీ
తెలంగాణలో బీజేపీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మున్సిపల్ ఎన్నికల రాష్ట్ర సహ ఇన్‌ఛార్జ్‌లు అశోక్ పర్ణామి, రేఖా శర్మతో కలిసి 'వికసిత్ తెలంగాణ.. బీజేపీ సంకల్ప పత్రం' పేరుతో మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ గెలిస్తే పెండింగ్ పనుల్లో వెసులుబాటు కల్పిస్తామని, మోడ్రన్ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే నిధులను పారదర్శకంగా ఖర్చు చేస్తామని తెలిపారు. అవినీతిరహిత మున్సిపాలిటీలే తమ లక్ష్యమని తెలిపారు. కబ్జాలపై ఉక్కుపాదం మోపుతామని అన్నారు. యువతకు వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు బీజేపీని చూసి భయపడుతున్నాయని అన్నారు. కేంద్రం తెలంగాణకు ఏమిచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారని, ఏ జిల్లాకు ఎంతిచ్చామో కూడా చెబుతామని అన్నారు. మరి రేవంత్ రెడ్డి ఏమిచ్చారో చెబుతారా అని నిలదీశారు. బీజేపీ కార్యకర్తలపై పోలీసులు దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పోలీసులను తమ కార్యకర్తల్లా ఉపయోగించుకుంటోందని అన్నారు.


More Telugu News