జనసేన నేతలతో పవన్ కల్యాణ్ భేటీ... రేపు, ఎల్లుండి తెలంగాణలో ఎన్నికల ప్రచారం

  • మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశం
  • హాజరైన టీ-జనసేన కీలక నేతలు
  • బీజేపీ తరపున కూడా ప్రచారం చేస్తానన్న పవన్
ఈ నెల 11న తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ జనసేన నేతలతో పవన్ భేటీ అయ్యారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల గురించి వారితో చర్చించారు. ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ ఇంచార్జి శంకర్ గౌడ్, రాజలింగం, సాగర్ (ఆర్కే నాయుడు) తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు, అలాగే బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఈ నెల 7, 8 తేదీల్లో ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు.  

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో... ఇప్పటికే ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అత్యధిక స్థానాలు గెలుచుకుని సత్తా చాటాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పట్టుదలగా ఉన్నాయి. పోటీలో బీజేపీ కాస్త వెనుకబడినట్టు కనిపిస్తున్న తరుణంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు కీలక ప్రకటన చేశారు. తాను, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవన్ కల్యాణ్ ను కలిశామని... మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఆయన పూర్తి మద్దతు తెలిపారని వెల్లడించారు. ఆయన చెప్పినట్టుగానే బీజేపీ తరపున ప్రచారం చేసేందుకు పవన్ సిద్ధమవుతున్నారు.


More Telugu News