East Godavari Tiger: తూర్పుగోదావరి జిల్లాలో పులి సంచారం

East Godavari Tiger Roaming Creates Panic in Andhra Pradesh
  • కూర్మాపురంలో పాడుబడిన ఇంట్లో నుంచి గాండ్రింపులు
  • హుటాహుటిన బయలుదేరిన అటవీ అధికారులు
  • రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పులి అడుగుజాడలు
ఆంధ్రప్రదేశ్ లో పులి సంచారం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. రాత్రిపూట బయటకు వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. ఎప్పుడు ఎక్కడ పులి దాడి చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురంలోని ఓ పాడుబడిన ఇంట్లో నుంచి పులి గాండ్రింపులు వినిపించాయి. ఆ ఇంట్లోకి పులి చేరిందని గుర్తించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీశాఖ అధికారులు హుటాహుటిన కూర్మాపురం బయలుదేరారు. ఇప్పటికే అక్కడికి పోలీసులు చేరుకున్నారు.

రాజమండ్రి పరిసర గ్రామాల్లో టెన్షన్
రాజమండ్రి పరిసర గ్రామాల్లో పులి అడుగుజాడలు కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. విషయం తెలిసి అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. గ్రామస్థులకు ఎలాంటి హాని కలగకుండా ముందజాగ్రత్తలు తీసుకున్నారు. పులి సంచరిస్తున్న గ్రామాల్లో గస్తీని పెంచడంతో పాటు రాత్రి వేళల్లో బయటకు రావద్దంటూ ప్రజలను హెచ్చరించారు. మత్తు ఇంజక్షన్ తో పులిని బంధించి తిరిగి అడవిలో వదిలేందుకు ఏర్పాట్లు చేశారు.

మహారాష్ట్ర నుంచి తెప్పించిన 4G కెమెరాలు పులి కనిపించిన క్షణాల్లోనే లొకేషన్ , పోటోలు , పూర్తి వివరాలను నేరుగా అధికారుల ఫోన్లకు పంపేలా అమర్చారు. పలుచోట్ల పులిని బంధించేందుకు బోన్లను ఏర్పాటు చేశారు. బోనులో పులి చిక్కుకున్న వెంటనే సంబంధిత శాఖ అధికారులకు అలర్ట్ వెళ్లే విధంగా వ్యవస్థను కూడా రూపొందించారు.
East Godavari Tiger
Tiger
Andhra Pradesh Tiger
Rayavaram
Kurmapuram
Rajahmundry
Forest Department
Tiger Tracking
Wildlife
Tiger Alert

More Telugu News