టీచర్‌పై విద్యార్థి కిరాతకం.. వేధింపులు వద్దన్నందుకు పెదవులు కోసేశాడు!

  • టీచర్‌ను కొంతకాలంగా వేధిస్తున్న 12వ తరగతి విద్యార్థి
  • స్కూల్ మారినా వెంటాడి వేధించిన నిందితుడు
  • పదునైన ఆయుధంతో దాడి చేసి పెదాలు కోసేసిన వైనం
  • ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో జనవరి 26న ఘటన
  • నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 12వ తరగతి విద్యార్థి తన ఉపాధ్యాయురాలిపై అత్యంత కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. పదునైన ఆయుధంతో ఆమె రెండు పెదాలను కోసేసి పరారయ్యాడు. జనవరి 26న మెయిన్‌పురిలో ఈ దారుణం జరిగింది.

బాధితురాలి సోదరుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఆగ్రా రోడ్డులోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో పనిచేస్తున్న తన సోదరిని నిందిత విద్యార్థి కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఈ విషయంపై గతంలో పేరెంట్-టీచర్ మీటింగ్‌లో విద్యార్థి తల్లికి ఫిర్యాదు చేయగా, ఇకపై అలా జరగదని ఆమె హామీ ఇచ్చారు. అయినప్పటికీ విద్యార్థి ప్రవర్తనలో మార్పు రాలేదు.

విద్యార్థి వేధింపులతో విసిగిపోయిన టీచర్, చివరకు ఆ స్కూల్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసి మరో పాఠశాలలో చేరారు. అయితే, నిందితుడు ఆమె కొత్త స్కూల్ ఆచూకీ తెలుసుకుని, రోజూ ఆమెను వెంబడించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో జనవరి 26న ఆమె విధులకు వెళ్తుండగా మార్గమధ్యంలో అడ్డగించి, పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఆమె రెండు పెదాలను కోసేసి అక్కడి నుంచి పారిపోయాడు.

ఈ ఘటనపై కొత్వాలి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఫతే బహదూర్ సింగ్ మాట్లాడుతూ, బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని, అతడిని అదుపులోకి తీసుకున్న తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు.


More Telugu News