వివాహేతర సంబంధాలు.. భర్తలను దారుణంగా చంపిన భార్యలు!

  • రాజస్థాన్‌లో హనీమూన్ తరహా హత్యోదంతం
  • తెలంగాణలో వివాహేతర సంబంధానికి భర్త బలి
  • వాకింగ్‌కు తీసుకెళ్లి మరీ ప్రాణాలు తీసిన భార్య
  • రెండు కేసుల్లోనూ గొంతు నులిమి చంపిన నిందితులు
వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్నాయి. క్షణికానందం కోసం కట్టుకున్న భర్తలను కడతేర్చేందుకు కూడా భార్యలు వెనుకాడటం లేదు. రాజస్థాన్‌ నుంచి తెలంగాణ వరకు వెలుగుచూసిన ఈ రెండు ఘటనలు సమాజంలో నైతిక విలువల పతనాన్ని చాటిచెబుతున్నాయి.

రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో మూడు నెలల క్రితమే పెళ్లయిన అంజు (23), ఆశిష్ దంపతుల కథ విషాదాంతమైంది. పెళ్లికి ముందే సంజు అనే వ్యక్తితో ఉన్న అక్రమ సంబంధాన్ని అంజు వివాహం తర్వాత కూడా కొనసాగించింది. భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం వేసిన ఆమె, జనవరి 30న రాత్రి వాకింగ్‌కు వెళ్దామని ఆశిష్‌ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లింది. అక్కడ అప్పటికే మాటు వేసిన ప్రియుడు సంజు, అతడి స్నేహితులతో కలిసి ఆశిష్‌ను గొంతు నులిమి చంపేసింది. అనంతరం ప్రమాదం జరిగినట్టు నాటకమాడినా, పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. పోలీసులు నిందితులు నలుగురిని అరెస్ట్ చేశారు.

అక్రమ సంబంధం చూశాడని.. 
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్‌లో మరో దారుణం జరిగింది. మెదక్ జిల్లాకు చెందిన దుర్గయ్య (36), మంజుల దంపతులు కూలి పనుల కోసం ఇక్కడికి వచ్చారు. ఈ క్రమంలో మంజులకు అదే గ్రామానికి చెందిన సంజీవ్‌తో సంబంధం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి ఉండగా భర్త దుర్గయ్య కంటపడటంతో, తన రహస్యం బయటపడుతుందనే భయంతో మంజుల ఘాతుకానికి పాల్పడింది. బుధవారం రాత్రి ప్రియుడితో కలిసి భర్తను గొంతు నులిమి హత్య చేసింది. మృతుడి సోదరి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.


More Telugu News