Indian Air Force: పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో భారత్ 'వాయు' గర్జన

Indian Air Force Vayu Shakti 2026 Exercise Near Pakistan Border
షార్ట్స్‌లో చూడండి
భారత వాయుసేన (IAF) తన సైనిక శక్తిని, వ్యూహాత్మక సంసిద్ధతను ప్రదర్శించేందుకు సిద్ధమైంది. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో, పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఫిబ్రవరి 27న 'వాయు శక్తి 2026' పేరిట భారీ వైమానిక విన్యాసాలు నిర్వహించనుంది. గతంలో సరిహద్దు దాటి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన 'ఆపరేషన్ సిందూర్' తరహాలో ఈ విన్యాసాలను రూపొందించారు. ఈ ప్రదర్శన ద్వారా భారత వాయు శక్తి సామర్థ్యాలు మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించనున్నాయి.

ఈ విన్యాసాల్లో వందకు పైగా విమానాలు పాల్గొననున్నాయని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. రఫేల్, సుఖోయ్-30, తేజస్, మిగ్-29, జాగ్వార్, మిరాజ్-2000, హాక్ వంటి యుద్ధ విమానాలు లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించనున్నాయి. వీటితో పాటు స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ప్రచండ్ అటాక్ హెలికాప్టర్ కూడా రాకెట్లను ప్రయోగిస్తుంది. వాయుసేన నుంచి వైదొలిగిన మిగ్-21 విమానం ఈ తరహా విన్యాసాల్లో కనిపించకపోవడం ఇదే తొలిసారి.

ఒక కృత్రిమ యుద్ధ వాతావరణాన్ని సృష్టించి, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (IACCS) ద్వారా ఈ మొత్తం విన్యాసాలను పర్యవేక్షించనున్నారు. 'ఆపరేషన్ సిందూర్' సమయంలో పాకిస్థాన్ విమానాలు, క్షిపణుల గమనాన్ని గుర్తించింది ఈ వ్యవస్థే. ఈ ఎక్సర్‌సైజ్‌లో భాగంగా సి-295 రవాణా విమానం మొదటిసారిగా రాత్రిపూట అసాల్ట్ ల్యాండింగ్ డ్రిల్ నిర్వహించనుంది. సి-130జె సూపర్ హెర్క్యులస్ విమానం చిన్న రన్‌వేపై ల్యాండ్ అయి, గరుడ్ కమాండోలను దించి, వెంటనే టేకాఫ్ అవుతుంది.

ఈ విన్యాసాల గురించి పాకిస్థాన్‌కు ముందస్తు సమాచారం అందించినట్లు, 'నోటీస్ టు ఎయిర్‌మెన్' (NOTAM) జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పలువురు వీఐపీలతో పాటు, ఢిల్లీలోని సుమారు 40 మిత్రదేశాల రాయబార కార్యాలయాల అధికారులు కూడా హాజరుకానున్నారు.


Go Back to Shorts
Indian Air Force
IAF
Vayu Shakti 2026
Rajasthan
Jaisalmer
Pakistan border
military exercise
Operation Sindoor
defence

More Telugu News