Dhulipalla Narendra Kumar: వైసీపీది బూతు సిద్ధాంతం.. ఎమ్మెల్యే ధూళిపాళ్ల ధ్వజం

Dhulipalla Narendra Criticizes YSRCPs Bootu Siddantham
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలో గత ఐదేళ్ల కాలంలో సాగిన అరాచక పాలనకు, ప్రస్తుత ప్రజాస్వామ్య పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారని టీడీపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడును మాచర్ల వంటి ప్రాంతాలకు వెళ్లకుండా అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ.. ఇప్పుడు జగన్ పర్యటనలు ప్రశాంతంగా సాగుతున్నాయంటే అది కూటమి ప్రభుత్వ ఉదారత అని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ రాష్ట్రంలో ఆటవిక పాలనే ఉంటే జగన్ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేదా అని ఆయన ప్రశ్నించారు.

ముఖ్యంగా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ధూళిపాళ్ల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీబీఐ ఛార్జ్ షీట్ లోని ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం యానిమల్ ఫ్యాట్ ఉందనేది వాస్తవమని.. నిబంధనలు మార్చి అపవిత్రతకు పాల్పడింది వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలేనని ఆరోపించారు. అరవై లక్షల లడ్డూలలో కల్తీ నెయ్యి వాడటం ఆగమశాస్త్ర విరుద్ధమని, ఈ పాపానికి వైసీపీ నేతలే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. "దొంగే దొంగా అని అరిచినట్లు" తప్పు చేసి కూడా చంద్రబాబునే క్షమాపణ కోరడం వారి అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు.

ఇక వైసీపీ నేతల భాషా ప్రయోగంపై స్పందిస్తూ.. ఆ పార్టీది 'బూతు సిద్ధాంతం'లా మారిందని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, సభ్యత ఉన్నవారెవరూ అలా మాట్లాడరని.. ఎక్కువ బూతులు తిడితే వైసీపీలో సన్మానాలు చేసే సంస్కృతి ఉందన్నారు. అంబటి ఇంటి వద్ద పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించలేదని, అదే జరిగి ఉంటే ఆయన అంత సురక్షితంగా ఉండేవారు కాదన్నారు. ఈ మొత్తం వ్యవహారాలపై లోతైన విచారణ జరగాలని, ముఖ్యంగా వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిల పాత్రపై దర్యాప్తు చేస్తే అసలు నిజాలు బయటపడతాయని ధూళిపాళ్ల పేర్కొన్నారు.
Go Back to Shorts
Dhulipalla Narendra Kumar
YSRCP
TDP
Andhra Pradesh Politics
Tirumala Laddu
YV Subba Reddy
Karunakar Reddy
Ambati Rambabu
Chandrababu Naidu

More Telugu News