బూతుల నేతలకు పరామర్శలా? జగన్‌పై టీడీపీ నేతల ఎదురుదాడి

  • జగన్ గుంటూరు పర్యటనపై టీడీపీ నేతల ఫైర్
  • అంబటి కుటుంబాన్ని పరామర్శించడం ఓ డ్రామా అంటూ విమర్శలు 
  • బూతులు మాట్లాడిన వారిని సమర్థించడం జగన్‌కు తగదని హితవు
  • దమ్ముంటే ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని సవాల్
  • తిరుపతి లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందనడం పచ్చి నిజం అని ఉద్ఘాటన
వైసీపీ అధినేత జగన్ తీరుపై అధికార తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుంటూరులో అంబటి రాంబాబును పరామర్శించేందుకు జగన్ చేసిన పర్యటనను ఒక డ్రామాగా అభివర్ణించారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, సీడాప్ ఛైర్మన్ దీపక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు... జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

పరామర్శ పేరుతో డ్రామా: అచ్చెన్నాయుడు

మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. "అసభ్యంగా బూతులు మాట్లాడిన నేతలను దండించాల్సింది పోయి, పరామర్శ పేరుతో జగన్ డ్రామాలు చేస్తున్నారు. తాడేపల్లి నుంచి గుంటూరుకు 34 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. కానీ, మునిగిపోతున్న వైసీపీని కాపాడుకునే విఫల ప్రయత్నంలో భాగంగా జగన్ ఈ ప్రయాణాన్ని 9 గంటల పాటు సాగదీశారు. తిరిగి మాత్రం అరగంటలోనే వచ్చేశారు. ఇది ప్రజాబలం లేక టీవీ సీరియల్ మాదిరి సాగదీసిన యాత్ర" అని ఎద్దేవా చేశారు. తమ పార్టీ నాయకులు అంబటి ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తే, దానిని దాడిగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. ఈ ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఖండించారని, హింసా రాజకీయాలకు తమ ప్రభుత్వంలో తావులేదని స్పష్టం చేశారు. "గత ఐదేళ్ల జగన్ జంగిల్ రాజ్ పాలనను చూసే ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడాలంటే రోడ్లపై కాదు, దమ్ముంటే అసెంబ్లీకి రండి" అని జగన్‌కు సవాల్ విసిరారు.

అరాచకానికి బీజం వేసింది జగనే: వర్ల రామయ్య

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ.. "గత ఐదేళ్లు రాష్ట్రాన్ని అరాచకమయం చేసి, ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది" అని తీవ్రంగా ధ్వజమెత్తారు. అసలు రాష్ట్రంలో జంగిల్ రాజ్‌కు బీజం వేసిందే జగన్ అని ఆరోపించారు. అంబటి రాంబాబు లాంటి వ్యక్తిని సౌమ్యుడని కితాబివ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో చంద్రబాబును ఇంటి గేటుకు తాళ్లు కట్టి అడ్డుకోవడం, మాచర్లలో టీడీపీ నేతలపై హత్యాయత్నం, అచ్చెన్నాయుడిని అక్రమంగా అరెస్టు చేయడం వంటివి జంగిల్ రాజ్ కాదా అని ప్రశ్నించారు. కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమా వంటి నేతలపై అక్రమ కేసులు బనాయించి వేధించారని గుర్తుచేశారు. చంద్రబాబు ఇంటిపై దాడికి తెగబడిన జోగి రమేశ్ ను మంచివాడని చెప్పడం సిగ్గుచేటన్నారు.

11 మందితో అసెంబ్లీకి రండి: దీపక్ రెడ్డి

సీడాప్ ఛైర్మన్ దీపక్ రెడ్డి మాట్లాడుతూ.. "వంద ఎలుకలను తిన్న పిల్లి కాశీకి వెళ్లినట్లు ఉంది జగన్ తీరు" అని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో గన్నవరం టీడీపీ ఆఫీసును తగలబెట్టడం, పట్టాభి ఇంటిపై దాడి చేసి మహిళలను భయభ్రాంతులకు గురిచేయడం, ఎంపీ రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వంటివి జంగిల్ రాజ్ కాదా? అని నిలదీశారు. "11 మంది సభ్యులు మీకు ఒక క్రికెట్ టీమ్ లాంటి వారు. అందుకే మీకు 'నెంబర్ 11 సైకో టీమ్' అని పేరు పెట్టాం. ఈ నెల 11న, 11 గంటలకు అసెంబ్లీకి వచ్చి కనీసం 11 నిమిషాల పాటు 11 ప్రశ్నలు అడిగే ధైర్యం ఉందా?" అని జగన్‌కు సవాల్ విసిరారు.

లడ్డూ నెయ్యిలో కల్తీ నిజం: అశోక్ బాబు

మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ.. తిరుపతి లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందనేది పచ్చి నిజమని స్పష్టం చేశారు. 2024 జులై 16న ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టులో బీఫ్ ఫ్యాట్ (ఆవు/ఎద్దు కొవ్వు), లార్డ్ (పంది కొవ్వు) ఉన్నట్లు స్పష్టంగా ఉందని తెలిపారు. వైసీపీ నేతలు టెక్నికల్ అంశాల పేరుతో దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమని వైసీపీకి సవాల్ విసిరారు. జగన్ రిపోర్టులు చదవకుండా మాట్లాడటం ఆయన అపరిపక్వతకు నిదర్శనమని విమర్శించారు.


More Telugu News

Jagan YS Jagan TDP Leaders Chandrababu Naidu Ambati Rambabu Andhra Pradesh Politics Telugu Desam Party YSR Congress Party Guntur Political Criticism