ఆ గేమ్‌కు బానిసయ్యారు.. చివరి టాస్క్ ఆత్మహత్య: ఘజియాబాద్ అక్కాచెల్లెళ్ల తండ్రి వ్యాఖ్యలు

  • రెండున్నరేళ్లుగా ఆన్‌లైన్ గేమ్‌కు బానిసయ్యారన్న తండ్రి
  • ముగ్గురు కూతుళ్లు కుటుంబానికి కూడా దూరమయ్యారన్న తండ్రి
  • వారి వద్ద ఎప్పుడూ ఫోన్లు ఉండేవని, గదుల్లోనే ఉండేవారన్న తండ్రి
తన కూతుళ్లు రెండున్నరేళ్లుగా ఆన్‌లైన్ గేమ్‌కు బానిసయ్యారని, ఆ గేమ్‌లలో చివరి టాస్క్ సూసైడ్ అని ఉందని దర్యాప్తు అధికారులు తమతో చెప్పారని ఘజియాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్ల తండ్రి మీడియాకు తెలిపారు. యూపీలోని ఘజియాబాద్‌లో గల తొమ్మిది అంతస్తుల అపార్టుమెంట్ నుంచి ముగ్గురు మైనర్ అక్కా చెల్లెళ్లు పాఖీ (12), ప్రాచి (14), విశిక (16) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆన్‌లైన్ కొరియన్ టాస్క్ ఆధారిత గేమ్‌కు బానిసైన వారు "క్షమించండి, నాన్నా" అంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ కొరియన్ ఆన్‌లైన్ గేమ్‌లో చివరి టాస్క్ ఆత్మహత్య అని తండ్రి మీడియాకు తెలిపారు. రెండున్నరేళ్లుగా ఈ గేమ్‌కు బానిసైన తన కూతుళ్లు క్రమంగా కుటుంబానికి కూడా దూరమయ్యారని అన్నారు. వారి వద్ద ఎప్పుడూ ఫోన్లు ఉండేవని, గదుల్లోనే ఉంటూ గేమ్ ఆడేవారని తెలిపారు. వారిలో ఒకరు ఇన్‌స్ట్రక్టర్‌గా ఉంటే, మిగతా ఇద్దరూ ఆదేశాలను పాటించే వారని తెలిపారు.

బుధవారం తెల్లవారుజామున ముగ్గురు అక్కాచెల్లెళ్లు బాల్కనీలోకి వెళ్లి తలుపు గడియ వేసి కిటికీలో నుంచి కిందకు దూకారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ బాలికలు కిందపడిపోవడాన్ని తాను ప్రత్యక్షంగా చూసినట్లు పక్క ఫ్లాట్ వ్యక్తి వెల్లడించారు. రాత్రి రెండు గంటల సమయంలో నేను బాల్కనీలోకి వచ్చానని ఆ సమయంలో వారు బాల్కనీలోనే ఉన్నారని, కానీ అక్కడ కూర్చున్నది ఎవరో తనకు అర్థం కాలేదని తెలిపారు. ఆ తర్వాత వారు కిందకు దూకుతుండటం చూసి కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసేలోపు ఒకరి తర్వాత ఒకరు దూకేశారని అన్నారు. ఆ తర్వాత తాను పోలీసులకు, అంబులెన్స్‌కు ఫోన్ చేశానని వెల్లడించారు.


More Telugu News

Ghaziabad Suicide Korean Game Online Game Suicide India Suicide Suicide Note