Mihir Akhauri: హైకోర్టు న్యాయవాది కుటుంబం సామూహిక ఆత్మహత్యాయత్నం.. యువ సీఏ మృతి

Ranchi Family Suicide Attempt CA Mihir Akhauri Dead
  • ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఘటన
  • ఆర్ధిక ఇబ్బందులే కారణమా?
  • విషగుళికలు మింగిన తల్లి, సోదరి
  • మృత్యువుతో పోరాడుతున్న బాధితులు
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని అశోక్ నగర్ (కద్రు ఏరియా) ప్రాంతంలో సోమవారం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మిహిర్ అఖౌరీ (24) అనే యువ చార్టర్డ్ అకౌంటెంట్ మరణించగా, అతడి తల్లి, మైనర్ సోదరి ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు.

మిహిర్ అఖౌరీ ఇటీవలే కోల్‌కతాలో తన సీఏ చదువు పూర్తి చేసుకుని రాంచీకి తిరిగి వచ్చాడు. ఆయనకు ఒక కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం కూడా లభించినట్లు తెలుస్తోంది. మిహిర్ తల్లి స్నేహ అఖౌరీ (50) ఝార్ఖండ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది. సోమవారం మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో ఇంటి నుంచి కేకలు వినిపించడంతో పొరుగువారు వచ్చి చూడగా ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.

అర్గోరా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికే మిహిర్ ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. తల్లి స్నేహ, 14 ఏళ్ల సోదరి విషగుళికలు మింగి అపస్మారక స్థితిలో ఉండటంతో వారిని వెంటనే గురునానక్ ఆసుపత్రికి తరలించారు. పొరుగువారు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ కుటుంబం కొంతకాలంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే ఆత్మహత్యకు పురికొల్పి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న స్నేహ అఖౌరీ, ఆమె కుమార్తె పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు మిహిర్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఇంట్లో ఎటువంటి సూసైడ్ నోట్ లభించకపోవడంతో, పోలీసులు ఆర్థిక లావాదేవీల కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు కోలుకుని స్టేట్‌మెంట్ ఇస్తేనే అసలు నిజాలు బయటపడతాయని అర్గోరా పోలీస్ స్టేషన్ ఇన్-చార్జ్ అనిల్ కుమార్ తివారీ వెల్లడించారు. 
Mihir Akhauri
Ranchi
Jharkhand
Suicide
CA
Lawyer
Financial crisis
Crime news
India news
Poison

More Telugu News