స్టాక్ మార్కెట్ సునామీ: సెన్సెక్స్ 2,400, నిఫ్టీ 750 పాయింట్లు జంప్!

  • ట్రంప్ టారిఫ్ కట్‌తో ఇన్వెస్టర్ల కాసుల పంట
  • ఒకే రోజులో రూ. 10 లక్షల కోట్ల సంపద ఆవిర్భావం
  • ఐటీ, టెక్స్‌టైల్, ఫార్మా షేర్ల దూకుడు
  • రికార్డు స్థాయిలో కోలుకున్న రూపాయి విలువ 
భారత్-అమెరికా మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం భారత స్టాక్ మార్కెట్లలో సరికొత్త చరిత్రను సృష్టించింది. మంగళవారం ఉదయం మార్కెట్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే సెన్సెక్స్ 2,400 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ ఏకంగా 750 పాయింట్లు ఎగబాకింది. అమెరికా విధిస్తున్న సుంకాలు 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గుతాయన్న వార్త ఇన్వెస్టర్లలో నూతనోత్సాహాన్ని నింపింది.

ఉదయాన్నే నిఫ్టీ 800 పాయింట్ల ప్రీమియంతో ట్రేడ్ అవ్వడం చూస్తేనే మార్కెట్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థమైంది. అమెరికాకు ఎక్కువగా ఎగుమతులు చేసే ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి ఐటీ దిగ్గజాల షేర్లు 5-7 శాతం లాభపడ్డాయి. అలాగే టెక్స్‌టైల్స్, ఫార్మా రంగాల్లో కొనుగోళ్ల జాతర సాగుతోంది. ఈ భారీ జంప్‌తో ఇన్వెస్టర్ల సంపద కేవలం గంటల వ్యవధిలోనే సుమారు రూ. 10 లక్షల కోట్లు పెరిగినట్లు అంచనా.

గత ఏడాదంతా ట్రంప్ విధించిన సుంకాలతో భారత మార్కెట్లు కుదేలయ్యాయి. కానీ ఇప్పుడు రష్యా చమురును పక్కనపెట్టి అమెరికాకు దగ్గరవ్వడం వల్ల పన్నుల భారం తగ్గడమే కాకుండా, విదేశీ పెట్టుబడులు తిరిగి భారత్‌కు వచ్చే మార్గం సుగమమైంది. ఇదే మార్కెట్ దూకుడుకు ప్రధాన కారణం.

 ఒకవైపు స్టాక్ మార్కెట్ పెరుగుతుంటే, మరోవైపు భారత రూపాయి కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే 90.15 వద్ద ట్రేడ్ అవుతూ బలోపేతమైంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత కొన్ని నెలలుగా అమ్ముకుంటూ వస్తుండగా, నేడు మళ్ళీ భారీగా కొనుగోళ్లు ప్రారంభించడం విశేషం. 


More Telugu News