రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ప్రభుత్వం అతిగా స్పందించింది: శశిథరూర్

డొక్లామ్ అంశంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభలో ప్రభుత్వం తరఫున అతిగా స్పందించారని కాంగ్రెస్ పార్టీ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ అన్నారు. రాహుల్ గాంధీ లేవనెత్తాలని ప్రయత్నించిన అంశాలు ప్రజలకు తెలిసిన విషయాలేనని అన్నారు.

పార్లమెంటు వెలుపల శశిథరూర్ విలేకరులతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ఒక మ్యాగజైన్‌లో ప్రచురితమైన కథనం ఆధారంగా మాట్లాడారని అన్నారు. సంబంధిత పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదని ప్రభుత్వం అభ్యంతరం చెప్పే బదులు ఆయనకు మాట్లాడే అవకాశం ఇచ్చి ఉండే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

ఎందుకంటే ఆ మ్యాగజైన్ ఎప్పుడైనా బయటకు వస్తుందని అన్నారు. అది బయటకు వస్తే ఎవరైనా చదవవచ్చని అన్నారు. నేను ఆ మ్యాగజైన్‌లోని అంశాలను ఇప్పుడే చదివానని, ఇతరులు కూడా చదువుతారని వ్యాఖ్యానించారు. 

కాగా, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే రాసిన పుస్తకంలోని అంశాలను రాహుల్ గాంధీ ఉటంకించడానికి ప్రయత్నించడంతో లోక్‌సభలో అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే.


More Telugu News