ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై కవిత కీలక వ్యాఖ్యలు

  • సిట్ పిలిస్తే విచారణకు వెళతానన్న జాగృతి అధ్యక్షురాలు
  • విచారణ సుదీర్ఘంగా కొనసాగడంపై విమర్శలు
  • త్వరగా పూర్తిచేసి దోషులను శిక్షించాలని డిమాండ్
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ట్యాపింగ్ వ్యవహారంలో విచారణను తొందరగా ముగించి దోషులకు శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సిట్ విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో అధికారులకు సహకరించేందుకు తాను సిద్ధమని చెప్పారు. అధికారులు పిలిస్తే తాను విచారణకు హాజరవుతానని కవిత తెలిపారు. 

ఈ మేరకు ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ మొదలై రెండు సంవత్సరాలు గడించిందని గుర్తుచేశారు. విచారణ సుదీర్ఘంగా కొనసాగడంపై విమర్శలు గుప్పించారు. విచారణ ఇంకెప్పుడు ముగుస్తుందని, దోషులను ఎప్పుడు శిక్షిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

సిట్ విచారణలో ఏం జరిగిందనే వివరాలను కేసీఆర్ బయటపెడతారని భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. కేసు విచారణనే తప్పుబడుతున్నట్లు కేటీఆర్ మాట్లాడటం సరికాదని కవిత అభిప్రాయపడ్డారు. చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత, అధికారులకు సహకరించాల్సిన విధి ప్రతీ పౌరుడిపైనా ఉందని వ్యాఖ్యానించారు. గుంట నక్కలతో కలిసి డ్రామాలాడుతోందంటూ కాంగ్రెస్ పార్టీపై ఆమె మండిపడ్డారు. తన ఫోన్ ను, తన భర్త ఫోన్ ను ట్యాప్ చేశారనే అనుమానిస్తున్నట్లు చెప్పిన కవిత.. సిట్ విచారణకు అధికారులు పిలిస్తే వెళతానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.


More Telugu News