Jogi Ramesh: జోగి రమేశ్ పై కేసు నమోదు.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మాజీ మంత్రి

Case Filed Against Jogi Ramesh After Alleged Remarks on Nara Lokesh
  • నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జోగి రమేశ్
  • ఇబ్రహీంపట్నం పీఎస్ లో కేసు నమోదు
  • నిన్న రాత్రి 1.30 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయిన జోగి
మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మంత్రి నారా లోకేశ్ పై జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జోగి రమేశ్ పై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలతో పాటు కులాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడారనే ఆరోపణలతో... 189(2), 190, 292, 324(4) BNS (143, 149, 290, 427 IPC) సెక్షన్ల కింద పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఇబ్రహీంపట్నం ఎస్ఐ సత్యవతి కేసు నమోదు చేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో, తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావించిన జోగి రమేశ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన ఫోను కూడా అందుబాటులో లేనట్టు తెలుస్తోంది. నిన్న రాత్రి జోగి రమేశ్ తిరుపతి నుంచి ఇబ్రహీంపట్నంలోని తన నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయనను పరామర్శించేందుకు మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు వచ్చారు. అనంతరం రాత్రి 1.30 గంటల సమయంలో జగ్ మోహన్ రావుతో కలిసి ఆయన తన నివాసం నుంచి వెళ్లిపోయారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు రాజీవ్ కూడా వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.

మరోవైపు, జోగి రమేశ్ ఇంటిపై జరిగిన దాడికి సంబంధించి మరో కేసు నమోదు చేయనున్నట్టు సమాచారం. ఈ ఘటనలో టీడీపీ శ్రేణుల పాత్ర ఏమిటనే దానిపై పోలీసులు దృష్టి సారించారు.
Jogi Ramesh
Nara Lokesh
YSRCP
Ibrahimpatnam Police
Andhra Pradesh Politics
Mondithoka Jagan Mohan Rao
TDP
Case Filed
Missing
Political Controversy

More Telugu News