గోవుపై అత్యాచారం.. మధ్యప్రదేశ్‌లో స్థానికుల విధ్వంసం

  • బేతుల్ జిల్లాలో దారుణం
  • ఆవుపై రేప్ వీడియో వైరల్
  • నిందితుడి షాపులకు నిప్పు
  • భారీగా పోలీసుల మోహరింపు
మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో ఒక వ్యక్తి ఆవుపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన తీవ్ర హింసకు దారితీసింది. నిందితుడు తన సొంత ఆవుపైనే లైంగిక దాడికి పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు, హిందూ సంఘాలు ఆగ్రహంతో ఊగిపోయాయి.

ఆగ్రహంతో ఊగిపోయిన నిరసనకారులు దామ్జీపురా ప్రాంతంలో నిందితుడికి సంబంధించిన పంక్చర్ షాపుతో పాటు మరో ఏడు దుకాణాలను తగులబెట్టారు. ఈ క్రమంలో ఎలక్ట్రికల్, సెలూన్, మొబైల్ స్టోర్లకు మంటలు వ్యాపించాయి. నాలుగు కార్లు, నాలుగు బైక్‌లతో పాటు ఒక ఇంటిని కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేలోపే లక్షలాది రూపాయల ఆస్తి నష్టం సంభవించింది.

ఘటన తీవ్రతను గమనించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వదంతుల వల్లే హింస చెలరేగిందని, అల్లర్లకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వీరేంద్ర జైన్ వెల్లడించారు. శాంతి భద్రతలను కాపాడేందుకు పొరుగు జిల్లాల నుంచి అదనపు బలగాలను రప్పించారు.

ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ ఉద్రిక్తత కొనసాగుతోంది. జనం సంయమనం పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అటు ఆవుపై జరిగిన అఘాయిత్యంపై, ఇటు జరిగిన ఆస్తి నష్టంపై పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News