తిరుపతి జిల్లాలో పోలీస్ యాక్ట్-30 అమలు

  • ఈ నెల 28వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటుందన్న ఎస్పీ సుబ్బరాయుడు
  • ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
  • సభలు, ఊరేగింపులకు తప్పనిసరిగా లిఖితపూర్వక అనుమతి పొందాలని సూచన
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తిరుపతి జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ - 30ను అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఒక నెల కాలవ్యవధికి అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లా పరిధిలో వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థలు ఒకే సమయంలో లేదా ఒకే ప్రదేశంలో ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించే అవకాశాల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలగవచ్చని పోలీసు శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. 

ఫిబ్రవరి నెలలో తిరుపతి జిల్లా పరిధిలో ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభల నిర్వహణపై నియంత్రణలు అమల్లో ఉంటాయి. ప్రజా ప్రదేశాల్లో సభలు లేదా ఊరేగింపులు నిర్వహించదలచిన వారు తప్పనిసరిగా ముందస్తుగా సంబంధిత అధికారుల నుంచి లిఖితపూర్వక అనుమతి పొందాలి. దరఖాస్తులో సభ లేదా ర్యాలీ నిర్వహించే ప్రదేశం, తేదీ, సమయం వంటి వివరాలు స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. పరిస్థితులను బట్టి మంజూరు చేసిన అనుమతిని ఎప్పుడైనా రద్దు చేసే అధికారం పోలీసు శాఖకు ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. అయితే వివాహాలు, అంత్యక్రియలు, వాటికి సంబంధించిన కార్యక్రమాలకు ఈ ఉత్తర్వులు వర్తించవని తెలిపారు. 

ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై పోలీస్ యాక్ట్ -1861తో పాటు ఇతర వర్తించే చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలు, సంఘాలు, సంస్థలు ఈ ఆదేశాలను గౌరవించి పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.


More Telugu News