బడ్జెట్ వేళ 'పెరుగు-చక్కెర' సెంటిమెంట్: రాష్ట్రపతి భవన్‌లో ఆ ఆచారం వెనుక రహస్యం ఇదే!

  • బడ్జెట్ ప్రసంగానికి ముందు రాష్ట్రపతి ఆశీర్వచనం
  • హిందూ సంప్రదాయంలో 'మధురమైన' ప్రారంభం 
  • ఆందోళన తగ్గించి ఏకాగ్రత పెంచే ‘సైన్స్’ 
  • మొరార్జీ దేశాయ్ రికార్డుకు చేరువలో నిర్మలమ్మ
దేశవ్యాప్తంగా కోట్ల మంది భారతీయుల భవిష్యత్తును నిర్ణయించే కేంద్ర బడ్జెట్ ప్రసంగానికి ముందు రాష్ట్రపతి భవన్‌లో ఒక ఆసక్తికరమైన దృశ్యం కనిపిస్తుంది. ఆర్థిక మంత్రి పార్లమెంట్‌కు బయలుదేరే ముందు రాష్ట్రపతి స్వయంగా 'పెరుగు-చక్కెర' తినిపిస్తారు. ఆదివారం నాటి బడ్జెట్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఈ తీపి ప్రసాదాన్ని తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఈ ఆచారం వెనుక కేవలం సెంటిమెంట్ మాత్రమే కాదు, బలమైన శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా?

భారతీయ సంస్కృతిలో ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు లేదా పరీక్షలు, ఇంటర్వ్యూలకు హాజరయ్యే ముందు పెరుగు-చక్కెర తినడం తరతరాలుగా వస్తున్న ఆచారం. దీనిని 'మధురమైన ప్రారంభం'గా భావిస్తారు. పెరుగును ‘శుభానికి’ చిహ్నంగా, చక్కెరను ‘విజయానికి’ సంకేతంగా పెద్దలు చెబుతారు. బడ్జెట్ వంటి అత్యంత కీలకమైన ఒత్తిడితో కూడిన పనిని నిర్విఘ్నంగా పూర్తి చేయాలని కోరుకుంటూ రాష్ట్రపతి ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు.

ఈ సంప్రదాయం వెనుక ఆరోగ్య సూత్రాలు కూడా దాగి ఉన్నాయి. పెరుగు సహజంగానే శరీరాన్ని చల్లబరిచే గుణాన్ని కలిగి ఉంటుంది. బడ్జెట్ ప్రసంగం వంటి హై-ప్రెషర్ సమయంలో కలిగే మానసిక ఆందోళనను, ఒత్తిడిని తగ్గించి మెదడును ప్రశాంతంగా ఉంచడానికి ఇది సహాయపడుతుంది. ఇక చక్కెరలోని గ్లూకోజ్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఈ రెండింటి కలయిక వల్ల ఏకాగ్రత పెరగడమే కాకుండా, ఎక్కువ సేపు అలసిపోకుండా ప్రసంగించే శక్తి లభిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

నేటి బడ్జెట్ ప్రసంగంతో నిర్మలా సీతారామన్ ఒక అరుదైన మైలురాయిని చేరుకోనున్నారు. ఇది ఆమెకు వరుసగా 9వ బడ్జెట్. తద్వారా మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం రికార్డును ఆమె సమం చేశారు. ఇప్పటివరకు అత్యధికంగా 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మొరార్జీ దేశాయ్ రికార్డుకు ఆమె కేవలం అడుగు దూరంలో ఉన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఆదివారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టడం కూడా ఒక విశేషం. 


More Telugu News