మోదీ ప్రభుత్వంతో సయోధ్య కోరుకుంటున్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్

  • బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి
  • బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి నిధులు వచ్చేలా కృషి చేయాలని సూచన
  • బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం జరగాలన్న పొన్నం ప్రభాకర్
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంతో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సయోధ్య కోరుకుంటోందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వచ్చే కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేంద్రం నిధులు కేటాయించేలా రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు కృషి చేయాలని సూచించారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం జరగాలని ఆకాంక్షించారు.

బడ్జెట్‌లో రాష్ట్రానికి ఏమేం కావాలో ఎప్పటి నుంచో అడుగుతున్నామని అన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరుతున్నామని అన్నారు. తెలంగాణ పట్ల ప్రధాని నరేంద్ర మోదీ చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. గతంలో తెలంగాణ పుట్టుకనే ఆయన అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్రం నుంచి ఏమీ అడగబోమని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అహంకారం ప్రదర్శించిందని, తాము మాత్రం సఖ్యత కోరుకుంటున్నామని అన్నారు. బడ్జెట్‌లో తమ ప్రతిపాదనలకు కేంద్రం అంగీకరించాల్సిందేనని స్పష్టం చేశారు. భారత ఫ్యూచర్ సిటీకి కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నిలిచిపోయిన ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలపాలని అన్నారు.


More Telugu News