మహారాష్ట్ర రాజకీయాల్లో మలుపు.. అజిత్ పవార్ వారసురాలిగా సునేత్రా పవార్?

  • అజిత్ పవార్ స్థానంలో ఆయన భార్య సునేత్రా పవార్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఎన్సీపీ నిర్ణయం
  • అజిత్ పవార్ ప్రాతినిధ్యం వహించిన బారామతి అసెంబ్లీ స్థానం నుంచే ఆమె పోటీ చేసే అవకాశం
  • అజిత్ పవార్ తుది కోరిక మేరకు రెండు ఎన్సీపీ వర్గాలు ఏకమయ్యేందుకు రంగం సిద్ధం 
మహారాష్ట్ర రాజకీయ ధృవతార, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాల మరణంతో ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేసేందుకు ఎన్సీపీ (అజిత్ వర్గం) కసరత్తు మొదలుపెట్టింది. అజిత్ పవార్ రాజకీయ వారసురాలిగా ఆయన భార్య, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సునేత్రా పవార్‌ను రంగంలోకి దించాలని పార్టీ సీనియర్ నేతలు నిర్ణయించినట్లు సమాచారం. ఆమెను రాష్ట్ర కేబినెట్‌లోకి తీసుకుని, ఉప ముఖ్యమంత్రి పదవిని అప్పగించాలని పార్టీ నాయకత్వం యోచిస్తోంది.

గురువారం బారామతిలో అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిసిన వెంటనే పార్టీ భవిష్యత్తుపై కీలక భేటీ జరిగింది. ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజబల్, సునీల్ తట్కరే వంటి సీనియర్ నేతలు సునేత్రాతో చర్చలు జరిపారు. "ప్రజలందరూ 'వాహిని' (సునేత్రా పవార్) నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అజిత్ దాదా ఆశయాలను ఆమె మాత్రమే ముందుకు తీసుకెళ్లగలరు" అని మంత్రి నరహరి జిర్వాల్ స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనపై చర్చించేందుకు ఎన్సీపీ నేతలు త్వరలోనే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలవనున్నారు.

అజిత్ పవార్ మరణం తర్వాత మహారాష్ట్రలో మరో ఆసక్తికర పరిణామం కనిపిస్తోంది. విడిపోయిన బాబాయ్ (శరద్ పవార్), అబ్బాయ్ (అజిత్ పవార్) వర్గాలు మళ్ళీ కలిసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. నిజానికి, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనే రెండు వర్గాలు కలిసి పనిచేశాయి. "కుటుంబం, పార్టీ మళ్ళీ ఒకటి కావాలన్నదే అజిత్ దాదా చివరి కోరిక. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి" అని పవార్ కుటుంబ సన్నిహితులు వెల్లడించారు.

బుధవారం బారామతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నేతగా పేరున్న ఆయన మరణం మహాయుతి (బీజేపీ-శివసేన-ఎన్సీపీ) కూటమికి పెద్ద దెబ్బ. ఇప్పుడు ఆ ఖాళీని సునేత్రా పవార్ ద్వారా భర్తీ చేసి, సానుభూతి పవనాలతో పార్టీని కాపాడుకోవాలని ఎన్సీపీ భావిస్తోంది. 


More Telugu News